CM Jagan:సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పురోగతి.. నిందితుడిని గుర్తించిన పోలీసులు

  • IndiaGlitz, [Tuesday,April 16 2024]

సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనకు సంబంధించి ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తులో పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఐదుగురు అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీగా చెందిన సతీష్ అలియాస్ సత్తి అనే యువకుడే సీఎంపై రాయితో దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో అతనితో పాటు ఉన్న నలుగురిని సైతం సిట్ అదుపులోకి తీసుకుంది. దాడికి గల కారణాలపై యువకులను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

అయితే ఫుట్‌పాత్ మీద వినియోగించే టైల్స్‌కు వినియోగించే రాయిని దాడికి ఉపయోగించినట్లు ఆ యువకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రాయి షార్ప్ గా ఉండటంతో పాటు గాయం కూడా తగులే అవకాశముండటంతో దానినే ఆ యువకుడు ఉపయోగించినట్లు చెబుతున్నారు. దీంతో సీఎంపై ఎందుకు దాడికి ప్రయత్నించారు? వీరి వెనక ఎవరైనా ఉన్నారా? లేక ఆకతాయిగా ఈ పనికి పాల్పడ్డారా? అన్న దానిపై మాత్రం విచారిస్తున్నారు. ఆకతాయి విసిరింది ఒక రాయి మాత్రమేనని అది ముందు సీఎం జగన్‌కు తగలి ఆ తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు తగిలిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

కాగా అంతకుముందు సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 సమాచారం ఇవ్వాలని కోరారు. నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని, దృశ్యాలను(సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించాలని విజ్ఞప్తి చేశారు. దాడి జరిగిన సమయంలో అక్కడ విద్యుత్తు లేకపోవడం, సీసీ టీవీ వైర్లు కూడా కట్ కావడంతో దర్యాప్తు కష్టంగా మారింది.

దాడి ఘటనపై విజయవాడలోని అజిత్‌ సింగ్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేశారు. ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు పెట్టిన పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్‌ వేశారు. ఇందులో ఆరు టీంలు పని చేస్తున్నాయి.