ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..

  • IndiaGlitz, [Sunday,January 10 2021]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై అధికారుల కమిటీ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన 26 జిల్లాల ఏర్పాటును అధికారుల కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్ల విషయానికి వస్తే మొత్తం 57 డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందినట్టు సమాచారం. వీటిలో కొత్తగా 7 డివిజన్ల ఏర్పాటుకు అధికారుల కమిటీ ప్రతిపాదించగా.. 3 డివిజన్ల రద్దును సైతం సూచించినట్టు తెలుస్తోంది.

అలాగే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో పార్వతీపురం, పాడేరు జిల్లాల ఏర్పాటును అధికారుల కమిటీ సూచించినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు వైసీపీ తన మేనిఫెస్టోలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామని.. మొత్తంగా ఏపీలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా బదిలీలు చేపట్టకూడదని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.