close
Choose your channels

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం?

Wednesday, February 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేంద్ర పాలితప్రాంతమైన పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఆ మేరకు కేంద్రహోంశాఖకు సిఫారసు చేయనున్నట్టు సమాచారం. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. బలనిరూపణలో సీఎం నారాయణస్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో నారయణస్వామి విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. నారాయణ స్వామి నేరుగా రాజ్‌భవన్‌కు రాజీనామా లేఖను అందజేశారు.

కాగా.. 14 మంది ఎమ్మెల్యేల బలమున్న ప్రతిపక్షపార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందేమోనని ఎల్‌జీ వేచిచూస్తున్నారు. అయితే ఏడుగురు ఎమ్మెల్యేలున్న ప్రధాన ప్రతిపక్షమైన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి అందుకు విముఖత చూపినట్టు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తనపై ఎలాంటి అపవాదు రాకుండా చూసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ కొద్ది రోజుల కోసం తొందరపడితే నారాయణస్వామి ప్రభుత్వాన్ని కూల్చి, తను గద్దెనెక్కానన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, ఇది రానున్న ఎలక్షన్స్‌లో తనకు మైనస్ అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.

నారాయణ స్వామి ప్రభుత్వాన్ని కూల్చడంతో ఎలాంటి సంబంధం లేని తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అనవసర అపవాదును మోయాల్సి వస్తుందని రంగస్వామి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆయన మిత్రపక్షాలకు సైతం తేల్చిచెప్పినట్టు సమాచారం. ఇప్పటికే తమిళిసై పుదుచ్చేరిలో నెలకొన్న పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని రాజ్‌నివాస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తమిళిసై సిఫారసు ఢిల్లీ చేరగానే రాష్ట్రపతి పాలనపై ప్రకటన వెలువడే అవకాశముందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.