చిరు ‘పునాదిరాళ్లు’ డైరెక్టర్ కన్నుమూత

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజుల వ్యవధిలోనే సినీ ప్రముఖులు కన్నుమూస్తుండటం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం తుదిశ్వాసవిడిచారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరుకు తీసుకెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌కుమార్ మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు, నటీనటులు సంతాపం తెలిపి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఇటీవలే పరీక్షలు చేయించిన చిరు..
తీవ్ర అనారోగ్యంతో మంచానపడ్డ రాజ్‌కుమార్ సాయం కోసం ఎదురుచూస్తున్నారని.. కనీసం మందులకు కూడా డబ్బుల్లేని ధీనపరిస్థితిలో వార్తలు వెలువడ్డాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి లాంటి పెద్దలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి సాయం చేస్తే బాగుంటుందని సినీ ప్రియులు, మెగాభిమానులు కోరడం జరిగింది. విషయం తెలుసుకున్న చిరంజీవి.. ఇటీవలే అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కొన్నిరోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడవటంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది.

మొదటి సినిమాకే 5 అవార్డ్స్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరి ఇప్పుడు మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు కొణిదెల చిరంజీవి. ఈయన ఇప్పటి వరకూ 151 సినిమాలు పూర్తి చేసుకున్నప్పటికీ.. కేరీర్ ప్రారంభం మాత్రం ‘పునాదిరాళ్లు’. చిరును ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి గూడపాటి రాజ్‌కుమార్. ఈ చిత్రానికి ఒకట్రెండు కాదు ఏకంగా 5 నంది అవార్డులు దక్కించుకున్నారు. ఈయన తెరకెక్కించింది.. నిర్మించింది కొన్ని చిత్రాలే అయినా.. అన్ని సామాజిక ఇతివత్తాలన్న చిత్రాలే.

అన్నీ విషాదాలే..!
కొన్నేళ్లుగా ఈయన పరిస్థితి ఆర్థికంగా చాలా అద్వాన్నంగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తయితే కుటుంబంలో వరుస విషాదాలు మరింత కుంగదీశాయి. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో కన్నుమూయడం.. సతీమణి కూడా కాలం చేయడంతో ఆయన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పుడు రాజ్‌కుమార్ కూడా మృతి చెందడంతో ఆయన చిన్నకుమారుడు ఒంటరివాడయ్యాడు. అంతేకాదు.. ఇప్పటికీ ఆయనకు సొంత ఇళ్లు కూడా లేదంటే పరిస్థితి అర్థం చేస్కోవచ్చు. ప్రస్తుతం చిన్నకుమారుడే అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుంచి సాయం అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది.