రష్మికను రీప్లేస్‌ చేయనున్న రాశీఖన్నా..

  • IndiaGlitz, [Monday,December 07 2020]

ప్రస్తుతం దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న.. ఓ సినిమాకు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక డ్రాప్‌ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఎవరిదో కాదు.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా చేస్తున్న సినిమా. ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో రూపొందనుంది. ప్రియాంక దత్‌, స్వప్నా దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు రష్మిక మందన్న కూడా హీరోయిన్‌గా నటిస్తుందని అనుకున్నారు. అయితే రష్మిక చివరకు డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక సారీ చెప్పేసిందట. దీంతో రష్మిక మందన్న స్థానంలో రాశీఖన్నా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 1964 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఇందులో దుల్కర్‌ సల్మాన్‌ రామ్‌ అనే సైనికుడిగా నటిస్తున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. 'యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ' అనే క్యాప్ష‌న్ ఇవ్వ‌డంతో సినిమాలోని ఇన్‌టెన్స్‌ను అర్థం చేసుకోవ‌చ్చు.

కేవ‌లం మ‌ల‌యాళ సినిమాల‌కే ప‌రిమితం కాకుండా విల‌క్ష‌ణమైన పాత్ర‌లు చేయ‌డానికి కూడా దుల్క‌ర్ ఆస‌క్తి చూపుతుండ‌టంతో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్రం కీర్తిసురేశ్‌తో వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా నిర్మించిన మ‌హాన‌టితోనే ద‌గ్గ‌ర‌య్యారు. ఈ చిత్రంలో జెమినీ గ‌ణేశ‌న్ పాత్ర‌లో దుల్క‌ర్ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ‘అందాల రాక్ష‌సి, ప‌డిప‌డి లేచె మ‌న‌సు’ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి ఈ పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిని తెరకెక్కించనున్నారు.