రాధేశ్యామ్‌కు రాజమౌళి వాయిస్ ఓవర్... తెలుగు నుంచి హిందీ వరకు ఒక్కో స్టార్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘‘రాధేశ్యామ్’’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అనేక వాయిదాల అనంతరం మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తామని స్వయంగా ప్రభాస్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాకు నెరేష‌న్‌ను ఒక్కో భారతీయ పరిశ్రమకు చెందిన ఒక్కో సెల‌బ్రిటీతో చెప్పించారు. బాలీవుడ్ సూప‌ర్ స్టార్, బిగ్ బి అమితాబ్ హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి ఇప్పటికే వాయిస్ ఓవ‌ర్‌ పూర్తి చేశారు. తెలుగు వెర్ష‌న్ వాయిస్ ఓవ‌ర్‌ను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చెప్పించారు. అలాగే కన్నడ వెర్షన్‌కు శివరాజ్ కుమార్, మలయాళ వెర్షన్‌కు పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళంలో సత్యరాజ్ వాయిస్ ఓవర్ చెప్పారు.

ఇకపోతే.. డార్లింగ్ ప్రభాస్ ఎక్కడా సినిమా చేసినా తన వంటమనిషితో వండించుకుని తినడం అలవాటు. తనే కాకుండా కోస్టార్స్కు కూడా ఇంటి భోజనాన్ని రుచిచూపిస్తాడు. ఇప్పటికే పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్కు తెలుగు రుచులను పంపాడు. కొద్దిరోజుల క్రితం బిగ్‌బి అమితాబ్‌కు కూడా ప్రభాస్ ఆతిథ్యం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ వేదికగా అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు.. ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయని అమితాబ్ ట్వీట్ చేశారు.

పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ‘రాధే శ్యామ్’ సినిమాను రూపొందించారు. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ సినిమాను నిర్మించగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఇందులో విక్ర‌మాదిత్య అనే హ‌స్త సాముద్రికా నిపుణుడి పాత్ర పోషించారు ప్ర‌భాస్.