మోదీ తర్వాత రజనీకాంతే

ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంతే... అవునా ఏ విషయంలో అనే సందేహం కలుగుతోంది కదూ.. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ సిరీస్ మేన్ వర్సెస్ వైల్డ్ డాక్యుమెంట‌రీ’ ఉంది కదా.. అప్పట్లో నరేంద్ర మోదీ కూడా ఈ చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే నాటి నుంచి ఇప్పటి వరకూ ఎవరూ ఇందులో పాల్గొనలేదు. తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. అంటే.. నరేంద్ర మోదీ తర్వాత రజనీకాంతే అక్కడికెళ్లారన్న మాట. పూర్తి వివరాల్లోకెళితే.. సోమ‌వారం నాడు బండిపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌ చేరుకున్న రజనీకాంత్.. నిన్న ఆరుగంట‌ల పాటు బ్రిటీష్ అడ్వెంచ‌ర‌ర్ బేర్ గ్రిల్స్ ఈ డాక్యుమెంట‌రీని ర‌జినీకాంత్‌పై చిత్రీకరించడం జరిగింది. ఇది పులులు ఎక్కువగా సంచ‌రించే బందీపూర్ ఆట‌వీ ప్రాంతం.

నాకేం కాలేదు!

ఇదిలా ఉంటే.. ఈ షూటింగ్‌లో రజనీకి స్వల్పగాయాలైనట్లు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. షూటింగ్‌లో ఆయన జారిపడటంతో భుజాలకు గాయాలయ్యానని జాతీయ మీడియా తెలిపింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ వార్తలపై తాజాగా సూపర్‌స్టార్ స్పందిస్తూ.. ‘నాకేం గాయాలు కాలేదు.. అభిమానులు ఆందోళన చెందొద్దు. కింద‌ప‌డిన‌ప్పుడు చిన్న చిన్న ముల్లులు కార‌ణంగా శ‌రీరంపై కొన్ని గీత‌లు అయ్యాయ్ అంతే. అంతకు మించి నాకు ఎలాంటి గాయాలు కాలేద‌ు’ అని స్పష్టం చేశారు. కాగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీ బుధవారం నాడు చెన్నైలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.