మిథున్ చక్రవర్తి కుమారుడిపై అత్యాచార కేసు..

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌పై అత్యాచార కేసు నమోదైంది. ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో 38 ఏళ్ల మహిళ మహాక్షయ్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2015 నుంచి మహాక్షయ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. అవి 2018 వరకూ కొనసాగాయని సదరు మహిల తెలిపింది. ఈ సమయంలోనే మహాక్షయ్ తనను వివాహం చేసుకుంటానని నమ్మించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

కాగా.. 2015లో అంధేరీ వెస్ట్‌లో ఉన్న మహాక్షయ్ ఫ్లాట్‌కు తాను వెళ్లానని.. అప్పుడు తనతో మత్తుమందు కలిపిన సాఫ్ట్ డ్రింక్ తాగించి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు వెల్లడించింది. తరువాత తాను గర్భవతిని కూడా అయ్యానని.. తన అబార్షన్ కోసం మహాక్షయ్ పిల్స్ ఇచ్చాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి గురించి అడిగితే ప్రతిసారి వాయిదా వేస్తూ వచ్చాడని పేర్కొంది.

2018లో వివాహం చేసుకోవడం కుదరదని మహాక్షయ్ చెప్పడంతో తమ మధ్య వాగ్వాదం జరిగిందని బాధితురాలు తెలిపింది. మహాక్షయ్ తల్లి యోగితా బాలి సైతం తనను బెదిరించిందని పేర్కొంది. 2018లో ఢిల్లీ బేగంపూర్ పోలీస్ స్టేషన్‌లో మహాక్షయ్, అతడి తల్లి యోగితా బాలిపై కేసు పెట్టినట్టు బాధితురాలు తెలిపింది. ఈ కేసులో మహాక్షయ్‌తో పాటు అతని తల్లికి ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిందని బాధితురాలు వెల్లడించింది. కాగా.. నేరం జరిగిన ప్రాంతంలో కేసు వేయాలని ఢిల్లీ కోర్టు బాధితురాలికి చెప్పడంతో ఓషివారా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.