పవన్‌కు రాఖీ... సెంటిమెంటుతో కొట్టిన రత్నప్రభ

  • IndiaGlitz, [Sunday,April 04 2021]

తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌ను సెంటిమెంటుతో కొట్టినట్టుగా అనిపించింది. నిజానికి ఇటీవలి కాలంలో పవన్.. బీజేపీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే ఇది కరెక్టేమో అనాలి. ఎందుకంటే బీజేపీ చేస్తున్న ప్రకటనలతో ఆ పార్టీ ఏపీలో కనీసం సోదిలో కూడా లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేస్తామని ప్రకటించడంతో పాటు స్పెషల్ స్టేటస్ ఇవ్వమని తేల్చేస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పూర్తిగా తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది.

ఇలాంటి సమయంలో పవన్.. బీజేపీకి మద్దతిస్తే జనసేనకు కూడా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బీజేపీకి కాస్త దూరమవుతున్నట్టు అనిపించిన జనసేన.. తాజాగా తిరిగి దగ్గరవుతోంది. తిరుపతి ఉపఎన్నిక జరుగుతున్నందున బీజేపీ తరుఫున పవన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి వెళ్లిన పవన్‌కు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎర్రకండువాతో రాఖీ కట్టి ఆకట్టుకున్నారు. జనసేన, బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో ఆమె పవన్ డైలాగ్‌ను చెప్పడం విశేషం.

రావటం ఆలశ్యం అవుతుందేమో గానీ, రావటం మాత్రం పక్కా అనే పవన్ డైలాగ్‌ను చెప్పి రత్నప్రభ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తిరుపతి నుంచి బీజేపీ విజయయాత్ర ప్రారంభమవుతుందని రత్నప్రభ పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా అభివృద్ధి చేశానని... ఇప్పుడున్న ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. రెండు సంవత్సరాలుగా బడ్జెట్ పెట్టడం లేదని రత్నప్రభ పేర్కొన్నారు. ఖజానా ఖాళీ అయినందునే బడ్జెట్ పెట్టడం లేదని విమర్శించారు. పరిశ్రమలు రావటం లేదని... ఉద్యోగాలు సైతం రావటం లేదన్నారు. నిరుద్యోగం పెరిగిపోతోందని. తమకు ఓటు వేస్తే ఏపీకి కొత్తదారి చూపిస్తామని రత్నప్రభ పేర్కొన్నారు.