పూజ చేసి ఆపేసిన రవితేజ..

  • IndiaGlitz, [Monday,April 19 2021]

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. ఏప్రిల్ రెండవ వారం నుంచి కరోనా కేసులు దారుణంగా పెరిగిపోయాయి. దీంతో సినిమా షూటింగ్‌లు నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌లు భయపడుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా సినిమా షూటింగ్‌లను వాయిదా వేసుకుంటున్నాయి. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. ఈసారి అలాంటి వాటికి తావివ్వకుండా చిత్ర యూనిట్‌లు ముందే జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాల షూటింగ్‌లకు కరోనా మహమ్మారి ఆటంకం కల్పిస్తోంది.

తాజాగా మాస్ మహరాజ్ రవితేజ తన నూతన చిత్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌ను మాత్రం వాయిదా వేసుకున్నారు. శరత్‌ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ... హీరో రవితేజ చేయనున్న మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నేటి(సోమవారం) నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లో చేయాలనుకున్న తొలి షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేసింది.

కొన్ని రోజులు వేచి చూసి.. కరోనా తగ్గుముఖం పట్టిన మీదటే చిత్రీకరణ ప్రారంభించాలని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి, హీరో, దర్శకుడు భావిస్తున్నారు. హైదరాబాద్‌ సహా హార్స్‌లీ హిల్స్‌, చిత్తూరు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో సుమారు 90 రోజులు షూటింగ్‌ చేయనున్నారట. ఇందులో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఓ హీరోయిన్‌గా ‘మజిలీ’ ఫేమ్‌ దివ్యాంశ కౌశిక్‌ను ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ను త్వరలో ఎంపిక చేయనున్నారని సమాచారం.