వైసీపీ ఎంపీని మోదీ భుజం తట్టడం వెనుక ఇదీ అసలు కథ!

  • IndiaGlitz, [Thursday,November 21 2019]

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు వైసీపీ ఎంపీలతో సమావేశమై.. మొత్తం అందరు ఎంపీలు.. సీనియర్, ముఖ్యనేత విజయసాయిరెడ్డి చెప్పినట్లే వినాలని ఆదేశించినట్లు తెలియవచ్చింది. అయితే ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ‘మాతృ భాష’ తెలుగుపై పెద్ద ఎత్తున చర్చేసాగింది. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ కేశినేని.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాట్లాడారు. అయితే జగన్ మాత్రం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఆంగ్ల మాద్యమం’ ప్రవేశపెట్టాలని ఇప్పటికే జీవోలు సైతం జారీ చేయడం.. రఘురాం మాత్రం ఒకింత వ్యతిరేకంగా మాట్లాడటంతో షోకాస్ నోటీసులిచ్చి.. క్లాస్ పీకడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చారట. అయితే ఇదే ఎంపీని ప్రధాని నరేంద్ర మోదీ పలకరించి మరీ భుజం తట్టడం ఆసక్తికర ఘటన.

భుజం తట్టిన మోదీ!
పార్లమెంట్ సమావేశాల్లో బాగంగా గురువారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్ వద్ద వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉండగా.. ప్రధాని మోదీ అటుగా వెళ్తున్నారు. మోదీకి ఎంపీ నమస్కరించగా.. ఇందుకు బదులుగా ‘హా.. రాజుగారు కైసే హై’ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు.. దగ్గరికి పిలిచి మరీ భుజం తట్టారు. కాగా.. ఈ ఆసక్తికర సన్నివేశం జరిగినప్పుడు రఘురామ కృష్ణంరాజు పక్కనే నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నారు. రాజ్యసభ నుంచి మోదీ తన ఛాంబర్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ఇదీ అసలు కథ!
రఘురామ కృష్ణంరాజు ఇప్పటి వరకూ ఏపీలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల్లో పనిచేశారు.. ఒక్క జనసేనలో మినహా. మొదట బీజేపీలో ముఖ్య నేతగా పనిచేశారు. బీజేపీ ముఖ్యనేత కావడం.. మరోవైపు ప్రముఖ పారిశ్రామికవేత్త కావడంతో అప్పట్లో ఈయనకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ఆ తర్వాత బీజేపీకి బాయ్ బాయ్ చెప్పేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటికే ఆయన వైసీపీలో నుంచి బయటికి వచ్చారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రభంజనంతో.. తిరిగి మళ్లీ అదేదో సామెత ఉందిగా.. అలా మళ్లీ సొంత పార్టీ అయిన వైసీపీలోకి వచ్చేశారు. ఎన్నికల్లో ఆయన నర్సాపురం ఎంపీ టికెట్ దక్కించుకుని భారీ మెజార్టీతో గెలుపొందారు. నాడు బీజేపీలో.. ఆ తర్వాత టీడీపీలో.. ఇప్పుడు మళ్లీ వైసీపీలోనూ ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. అప్పట్లో ఉన్న గుర్తింపుతో ఇవాళ రాజును చూడగానే మోదీ పలకరించారు. ఇదీ అసలు కథ.