బాబు రౌడీ-ఎమ్మెల్యేలు ఎర్రగడ్డ నుంచి..: రోజా షాకింగ్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఎలాంటి వారిపై అయినా విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటారన్న విషయం తెలిసిందే. అది అసెంబ్లీనా.. మీడియా పాయింటా..? లేకుంటే ఇంటర్వ్యూనా అనేది చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టేస్తుంటారు. తనపై.. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఎవరైనా విమర్శలు గుప్పిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ను ఆయన తల్లిదండ్రులు అమెరికాకు పంపిస్తే.. ఆయన మాత్రం పారిపోయి ఇండియాకు వచ్చేశాడని.. తన కుమారుడు నారా లోకేష్ను మాత్రం అమెరికాలోనే నిలబడి ఉన్నత చదువులు పూర్తి చేశాడని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇంకా చంద్రబాబు మాటలు పూర్తికాక మునుపే స్పీకర్ అనుమతి కోరి అసెంబ్లీలో మాట్లాడిన రోజా.. బాబు, ఎమ్మెల్యేలు.. లోకేష్పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇందుకేనా అమెరికా వెళ్లింది!?
‘చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారు.. కానీ లోకేశ్ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్ ఉన్నాడు. మంగళగిరిని మందలగిరి అని అన్నాడు.. చంద్రబాబు మందబుద్ధి ఉన్న కొడుకును కన్నారు. చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా..?. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయింది. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా?’ అని ఈ సందర్భంగా చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.
ఎర్రగడ్డ నుంచి లొల్లి చేయడానికే..!
అంతటితో ఆగని రోజా.. ‘మహిళా భద్రత బిల్లుపై అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలు వేసుకొని వచ్చారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు టీడీపీ నేతలు నటిస్తున్నారంతే. రైతుల సమస్యపై సభలో మాట్లాడాలని సమయం ఇస్తే బయట తిరుగుతున్నారు. చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారు. సొంత కుమారుడిని గెలిపించుకోలేని చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మిగిలిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి లొల్లి చేయడానికే అసెంబ్లీకి వచ్చారు’ అని రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే రోజా ఈ మాటలన్నీ అసెంబ్లీలో మాట్లాడగా.. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు తెరవకుండా ముక్కున వేలేసుకునేంత పనిచేశారు!. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడగా.. తాజాగా చంద్రబాబుపై రోజా దుమ్మెత్తిపోశారు. మరి ఈ ఇద్దరి నుంచి రోజా వ్యాఖ్యలకు రియాక్షన్ ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.