అప్‌డేట్ ఇస్తున్నాం.. ఆయన వచ్చేశారు: ‘ఆర్ఆర్ఆర్’ టీం

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ టీం ఓ అప్‌డేట్‌ను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్‌ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ కూడా సెట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీం వెల్లడించింది. ‘క్లైమాక్స్‌ గురించి ఎలాంటి అప్డేట్‌ రావడం లేదని ఆలోచిస్తున్న అభిమానుల కోసం ఒక అప్డేట్‌ ఇస్తున్నాం.. క్లైమాక్స్‌ కోసం పావెల్‌ వచ్చారు’ అంటూ చిత్ర యూనిట్ ట్విటర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డైరీస్‌ పేరుతో అభిమానులతో పంచుకుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ పీరియాడికల్‌ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరిస్‌ నటిస్తుండగా.. చెర్రీకి జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ సందడి చేయనుంది. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం అక్టోబర్‌ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.