close
Choose your channels

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ సినిమా 'సావిత్రి w/o సత్యమూర్తి' ప్రారంభం

Wednesday, March 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'కేరింత' ఫేమ్ పార్వతీశం కథానాయకుడిగా ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్న సినిమా 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన చైతన్య కొండ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో భార్య పాత్రలో సీనియర్ నటి శ్రీలక్ష్మి నటిస్తున్నారు. 60 ఏళ్ల ఆవిడకు 25 సంవత్సరాల కుర్రాడు ఎలా భర్త అయ్యాడనే ఆసక్తికర కథాంశంతో వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో బుధవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్ ఇచ్చారు. బుధవారం సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా దర్శకుడు చైతన్య కొండ మాట్లాడుతూ " దర్శకుడిగా నా తొలి చిత్రమిది. నా స్నేహితుడు నరేంద్ర నిర్మిస్తున్నారు. మాది చాలా ఏళ్ల పరిచయం. రెండేళ్ల నుంచి మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' కంటే ముందు రెండు కథలు చెప్పాను. రెగ్యులర్ గా ఉన్నాయి. నా మనసులోనూ ఏదో చిన్న అసంతృప్తి. అప్పుడు ఈ సినిమా కథ చెప్పాను. వెంటనే ముందుకు వెళ్దామని నరేంద్ర అన్నారు. కథగా చెప్పాలంటే... పాతికేళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్య. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎలా అయ్యారు అనేది ఆసక్తికరమైన అంశం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూస్తూ హాయిగా నవ్వుకునే సినిమా. 'కేరింత' చూసిన తర్వాత 60 ఏళ్ల భార్యకు భర్త గా నటించే పాతికేళ్ళ కుర్రాడిగా పార్వతీశం అయితే బాగుంటుందని అతడిని ఎంపిక చేశాం.‌ అతడి కుమారులుగా శివారెడ్డి, సునీల్ శెట్టి... అతని తమ్ముడిగా జెన్నీగారు నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ గారు భార్య పాత్ర చేస్తున్నారు" అని అన్నారు.

నిర్మాత గోగుల నరేంద్ర మాట్లాడుతూ " ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతుండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మంచి వినోదాత్మక చిత్రమిది. ఆద్యంతం ప్రేక్షకులు నవ్వుకునేలా దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ లో 25 రోజులు, అవుట్ డోర్ లొకేషన్ లో 20 రోజులు షూటింగ్ ప్లాన్ చేశాం. 45 రోజుల్లో మొత్తం సినిమా పూర్తి చేస్తాం" అని అన్నారు.

నటి శ్రీలక్ష్మి మాట్లాడుతూ " వైవిధ్యమైన ఎన్నో మేనరిజమ్స్ తో ఎన్నో వెరైటీ పాత్రలు చేశాను. చాలా రోజుల తర్వాత మరో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నాను. కాస్త లేట్ అయినప్పటికీ లేటెస్ట్ గా మంచి పాత్ర వచ్చింది. ఇంతవరకు నేను ఇటువంటి పాత్ర చేయలేదు. నాకు కుమారుడుగా నటించవలసిన పార్వతీశం భర్తగా చేస్తున్నారు. యూత్ మొగుడు... వింటుంటే నాకే నవ్వొస్తుంది. సినిమాకు వస్తే మిమ్మల్ని నవ్విస్తుంది. మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని అన్నారు.

హీరో పార్వతీశం మాట్లాడుతూ " నాకు 'కేరింత'లో మంచి పేరు తెచ్చింది. అంతకు మించి పేరు తీసుకొచ్చే పాత్ర ఈ సినిమాలో లభించింది. హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కథను నమ్మి మేమంతా ఈ సినిమా చేస్తున్నాం" అని‌ అన్నారు.

నటుడు శివారెడ్డి మాట్లాడుతూ " అద్భుతమైన వినోదంతో కూడిన మంచి పాత్రను దర్శకుడు చైతన్య నాతో చేయిస్తున్నారు. ఆయన ఫోన్ చేసి స్టొరీ లైన్ చెప్పినప్పుడు నేను కారులో వెళ్తున్నాను. నేను మీకు మళ్లీ ఫోన్ చేస్తానని పెట్టేశా. కాసేపటి తరువాత ఒక చోట ఆగి ఫోన్ చేశా. నా పాత్రతో పాటు కథ చెప్పారు. చాలా చాలా బాగుంది. విపరీతంగా నచ్చింది. వెంటనే చేస్తానని చెప్పాను. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గర పని చేసిన అనుభవంతో చైతన్య సినిమాలో బాగా తీస్తారని ఆశిస్తున్నాను. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది" అని అన్నారు.

సంగీత దర్శకుడు ఎస్.కె. ఖద్దూస్ మాట్లాడుతూ " నిన్నటితో సాంగ్స్ కంపోజిషన్ కంప్లీట్ అయ్యింది. మూడు కమర్షియల్ సాంగ్స్ చేసే అవకాశం దక్కింది. పాటలు కథలో భాగంగా, కథానుగుణంగా వస్తాయి. ఇప్పటివరకు 18 సినిమాలు చేశా. ఈ సినిమా బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాను. మా ఊరు దగ్గర వ్యక్తి ఇ నరేంద్ర గారు నిర్మాతగా ఈ సినిమా చేస్తుండడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

నటులు జనార్ధన్ (జెన్నీ) మాట్లాడుతూ " దర్శకుడు ఫోన్ చేసి సినిమాలో హీరో తమ్ముడి వేషం వేయాలని చెప్పారు. నాకు 70 ఏళ్లు. 'హీరోకి 80 సంవత్సరాలు ఉంటాయా?' అని అడిగా. 'లేదండీ! పాతికేళ్లు' అని చెప్పారు. లైన్ నచ్చింది. నన్ను గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేసి వేషం ఇచ్చిన దర్శకుడికి థాంక్యూ. సావిత్రి, సత్యమూర్తి... ధర్మానికి ప్రతీకలు. ఆ పేరులోనే ధర్మం, హాస్యం ఉన్నాయి. ఆ పేర్లు రెండూ వచ్చేలా టైటిల్ పెట్టడంలో దర్శకుడి ప్రతిభ తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్లు ఆషి రాయ్, గీత్ షా, ముస్కాన్ అరోరా తదితరులు పాల్గొన్నారు.

పార్వతీశం, శ్రీలక్ష్మి, గౌతమ్ రాజు, శివారెడ్డి, అనంత్, సుమన్ శెట్టి, జనార్ధన్ (జెన్నీ), సుబ్బరాయ శర్మ తదితరులు ఈ సినిమాలో తారాగణం.

ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఎల్లారెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: పీవీ రాజు, ఎడిటర్: మహేష్, లిరిక్స్: సురేష్ బనిశెట్టి, మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.కె. ఖద్దూస్, సినిమాటోగ్రఫీ: ఆనంద్ డోల, ప్రొడ్యూసర్: గోగుల నరేంద్ర, కథ - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్: చైతన్య కొండ.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.