సజ్జనార్‌కు థ్యాంక్స్ చెప్పిన స్కూల్ ‌పిల్లలు!

  • IndiaGlitz, [Friday,December 06 2019]

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండింది!. ఇవాళ తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు వారిని కాల్చిచంపారు. అయితే ఈ ఘటనను యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు దీన్ని సమర్థిస్తున్నారు. మరోవైపు తమదైన శైలిలో మీడియా, సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. అయితే నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా.. సీపీ సజ్జనార్‌ను సంప్రదించిన పోలీసులు.. ఆయన కీలక ఆదేశాలతో ఎన్‌కౌంటర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

చాలా మంచి పని చేశారు సార్!

అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఆ ప్రాంతానికి సజ్జనార్ చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు అసలేం జరిగింది..? అనే విషయాన్ని నిశితంగా వివరించారు. ఇదిలా ఉంటే.. స్కూల్‌ బస్సులో వెళ్తున్న విద్యార్థులు సజ్జనార్‌కు చేయిచ్చి.. థ్యాంక్స్ చెప్పారు. ‘చాలా మంచి పని చేశారు సార్’ అని ఆయనకు పలువురు విద్యార్థులు గులాబీలు ఇచ్చారు. ఈ క్రమంలో సజ్జనార్ జిందాబాద్.. జైజై సజ్జనార్ అంటూ అక్కడున్న జనాలు నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు అటుగా వాహనాల్లో వెళ్తున్న జనాలు సజ్జనార్‌కు దండం పెట్టారు.