close
Choose your channels

టాలీవుడ్‌లో విషాదం .. సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

Saturday, April 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటులు బాలయ్య కన్నుమూశారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని తన స్వగృహంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 94 సంవత్సరాలు.

1930లో గుంటూరు జిల్లా చావపాడులో ఆయన జన్మించారు. చెన్నైలోని ప్రఖ్యాత గుండీ ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లోనే బీఈ (మెకానికల్) చదివారు. ఆ సమయంలోనే నాటకాలు వేస్తూ గుర్తింపు పొందారు. బాలయ్యను చూసిన కొందరు .. హిందీ నటుడు అశోక్ కుమార్ లాగా ఉన్నావు అనేవారు. దాంతో ఆయనకు కూడా సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అప్పటికే ‘రోజులు మారాయి’ చిత్రంతో దర్శకునిగా తనదైన ముద్ర వేసిన తాపీ చాణక్యను కలిశారు. ఆయన కూడా బాలయ్యను ప్రోత్సహిస్తూ తాను తెరకెక్కించిన ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో హీరోని చేశారు. బాలయ్య హిందీలో పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్ ను, తెలుగులో ఎన్టీఆర్ ను అభిమానించేవారు. అన్నగారితో కలసి పనిచేయడం వల్ల ఆయన క్రమశిక్షణకు ఆకర్షితులయ్యారు బాలయ్య.

నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించిన బాలయ్య.. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగానూ రాణించారు. అమృత ఫిల్మ్స్ బ్యానర్‌పై చెల్లెలి కాపురం, నేరము - శిక్ష , చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట తదితర చిత్రాలను బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి, చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డులను అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా బాలయ్య మరణం పట్ల సంతాపం తెలియజేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.