నిద్రలోనే తుదిశ్వాస విడిచిన సీనియర్ నటి జయంతి!

  • IndiaGlitz, [Monday,July 26 2021]

సీనియర్ నటి జయంతి అంటే తెలియనివారుండరు. సోమవారం ఉదయం ఆమె మరణ వార్తతో అభిమానులు మేల్కోవాల్సి వచ్చింది. 76 ఏళ్ళ జయంతి నేడు బెంగుళూరు లోని తన నివాసంలో మరణించారు. జయంతి కుమారుడు కృష్ణ కుమార్ ఈ విషాదకర వార్తని మీడియాకు తెలియజేశారు.

జయంతి దక్షణాది భాషల్లో దాదాపు 500పైగా చిత్రాల్లో నటించారు. తన అద్భుతమైన నటన, అభినయంతో ప్రేక్షకులని దశాబ్దాల కాలం అలరించారు. ముఖ్యంగా కన్నడలో ఆమె ఎన్నో చిత్రాల్లో నటించారు. లెజెండ్రీ నటుడు రాజ్ కుమార్ తో కలసి ఆమె 30 చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.

జయంతి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో జన్మించారు. తల్లి దండ్రులు విడిపోవడం వల్ల ఆమె చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. జయంతి అసలుపేరు కమలకుమారి. షూటింగ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె కన్నడ దర్శకుడు వైఆర్ స్వామి దృష్టిలో పడ్డారు. అలా ఆమెకు జేనుగూడ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించే ఛాన్స్ దక్కింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

కమలకుమారి పేరు చాలా మందికి ఉండడంతో జయంతిగా ఆమె స్క్రీన్ నేమ్ మార్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తో కలసి జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆల్ టైం క్లాసిక్ పెదరాయుడులో జయంతి.. రజని సోదరిగా నటించిన సంగతి తెలిసిందే. అలా ఆమె తెలుగులో కూడా తనదైన ముద్ర వేశారు. అలాగే స్వర్ణ మంజరి, రైతుబిడ్డ, మాయదారి మమల్లిగాడు చిత్రాలు జయంతిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి.

1965లో మిస్ లీలావతి చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. జయంతి సినిమారంగంలోనే కాదు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టారు. 1998లో లోక్ శక్తి పార్టీ తరుపున చిక్ బల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. మైసూర్ యూనివర్సిటీ ఆమెని డాక్టరేట్ తో సత్కరించింది.