YS Sharmila: అవినాశ్ రెడ్డిపై షర్మిల పోటీ.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కడప లోక్‌సభ స్థానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ ఎంపీ స్థానం నుంచి పల్లంరాజు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్దరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా రామ్ పుల్లయ్య యాదవ్ బరిలో దిగనున్నారు.

ఇక వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆర్థర్ నందికొట్కూరు నుంచి.. ఎలీజా చింతలపూడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నారు. ఇక కోడుమూరు నుంచి వైపీపీ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణకు అవకాశం కల్పించారు. మిగిలిన 61 అసెంబ్లీ, 20 ఎంపీ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు. వామపక్షాలతో పొత్తు ఉండటంతో ఆ పార్టీలకు కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది.

కొన్ని రోజులుగా కడప నుంచి ఎంపీగా షర్మిల పోటీ చేయనున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే నిజమైంది. దీంతో ఆమె వరుసకు తమ్ముడు అయ్యే వైయస్ అవినాశ్ రెడ్డిపై పోటీ చేయనున్నారు. దీంతో తొలిసారిగా వైయస్ కుటుంబ సభ్యులు ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఇక టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. కడప జిల్లా వైయస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిది. దశాబ్దాలుగా ఈ జిల్లాల్లో వైయస్ కుటుంబ మద్దతు ఉన్న నేతలే గెలుస్తూ వస్తున్నారు. కడప ఎంపీగా దివంగత నేతలు వైఎస్సార్, వివేకానందరెడ్డి, ప్రస్తుత సీఎం జగన్, వైయస్ అవినాశ్ రెడ్డి విజయం సాధించారు.

ఇప్పుడు వైయస్ ఫ్యామిలీ నుంచి వైఎస్సార్ వారసురాలిగా కాంగ్రెస్ తరపున అధ్యక్ష హోదాలో షర్మిల.. వైసీపీ నుంచి అవినాశ్ రెడ్డి మధ్యే హోరాహోరీ పోరు ఉండనుంది. వివేకా హత్య కేసులో నిందితుడిగా అవినాశ్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడాలంటే వైసీపీ ఓడిపోవాలని షర్మిల, సునీత ప్రజలకు పిలుపునిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో తన మద్దతు షర్మిలకే ఉంటుందని వివేకా కుమార్తె సునీతారెడ్డి ప్రకటించారు. మరోవైపు టీడీపీ కూడా పరోక్షంగా షర్మిలకు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అటు వివేకా హత్య కేసు నిందితుల గురించి జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవినాశ్‌ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.