చంద్రబాబుకు షాకిచ్చిన నలుగురు కాపు కీలక నేతలు!
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాపు కీలకనేతలు షాకిచ్చారు. ఇటీవలే కాపు కీలకనేతలంతా భేటీ అయ్యి టీడీపీని వీడాలని ఆలోచించినట్లు తెలిసింది. అయితే విదేశీ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చిన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి బోండా ఉమా,జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్తో పాటు పలువురు నేతలు డుమ్మా కొట్టారు. అయితే వీళ్లంతా ఇళ్ల దగ్గరే ఉండి కూడా భేటీకి రాకపోవడం గమనార్హం.
మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విజయవాడలోనే ఉండి కూడా.. పక్కనే ఉన్న చంద్రబాబు నివాసంలో జరుగుతున్న భేటీకి రాలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా ఈ సమావేశానికి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమా, పోతుల సునీత మాత్రమే హాజరయ్యారు. పలువురు కీలకనేతలు హాజరుకాకపోవడంతో టీడీపీలో మరోసారి లుకలుకలు మొదలయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా.. బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రజావేదిక కూల్చివేతపై, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, బాబు ఫ్యామిలీకి భద్రత కుదింపుపై చర్చించేందుకు సీనియర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయితే.. భేటీకి హాజరుకాని ఈ కీలకనేతలు టీడీపీకి టాటా చెప్పి బీజేపీలోకి జంప్ అవుతారా..? లేకుంటే పార్టీలోనే కొనసాగుతారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై భేటీకి డుమ్మా కొట్టిన నేతలు ఎలా రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.