కేసీఆర్కు ఊహించని షాక్.. పుంజుకున్న బీజేపీ, కాంగ్రెస్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఊహించని షాక్ తగిలింది. ‘కారు పదహారు.. సర్కార్..’ ‘సారు.. పదహారు కేసీఆర్’ అనే నినాదాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని కేసీఆర్ అండ్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేయగా కేవలం 9స్థానాలకే టీఆర్ఎస్ పరిమితమైంది. దీంతో టీఆర్ఎస్కు కోలుకోలేని షాక్ తగిలినట్లైంది. అయితే ఈ రేంజ్ గులాబీ కోటలకు బీటలు వారతాయని బహుశా కేసీఆర్ ఊహించి ఉండరేమో.
కవిత అట్టర్ ప్లాప్..!
ముందుగా అనుకున్నట్లుగానే నిజామాబాద్ జిల్లాలో కవిత ఘోరంగా ఓటమి చెందారు. పసుపు రైతులు వారి పంతం నెగ్గించుకున్నారని చెప్పుకోవచ్చు. గత ఐదేళ్లలో తమ డిమాండ్లను నెరవేర్చలేదన్న ఆగ్రహం.. కవితకు ఓట్ల రూపంలో రుచి చూపించి ప్రతీకారం మొత్తం తీర్చుకున్నారు. 2014లో నిజామాబాద్ నుంచి గులాబీ జెండా రెపరెపలాడించిన కవిత 2019 ఘోరంగా ఓటమి చవిచూశారు.
ఈ నియోజకవర్గంలో ప్రధానంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ను కవిత నెరవేర్చకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనై ఏకంగా కవితపైనే 178 మంది రైతులు పోటీ చేయడం గమనార్హం. కాగా ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ధర్మపురి అరవింద్.. కవితపై 68 వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాగా.. కేంద్రం డబ్బులివ్వకపోతే తన సొంత డబ్బుతో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానంటూ హామీలు ఇచ్చి.. రైతులను ఆకట్టుకుని.. వారి మనసులు గెలిచి గెలుపొందారు.
హస్తం, కమలంకు ప్రాణమొచ్చింది!
మరోవైపు.. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. మల్కాజ్గిరి- రేవంత్ రెడ్డి, భువనగిరి-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ-ఉత్తమ్ కుమార్ స్థానాల్లో విజయం సాధించారు. మరోవైపు బీజేపీ 4 స్థానాల్లో విజయ డంఖా మోగించింది. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి, కరీంనగర్-బండి సంజయ్, నిజామాబాద్-ధర్మపురి అరవింద్ గెలుపొందారు.
మొత్తానికి చూస్తే.. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చనిపోయిన కాంగ్రెస్, బీజేపీలకు మళ్లీ ఊపిరొచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలా ఏకంగా ప్రతిపక్షాలు 7 స్థానాలను కైవసం చేసుకోవడం టీఆర్ఎస్కు పెద్ద షాకేనని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పుంజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఓడిపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో నేతలకు మంచి కిక్కు వచ్చినట్లైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.