close
Choose your channels

Siddaramaiah:సస్పెన్స్‌కు చెక్ : కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య... హైమాండ్ బుజ్జగింపులతో దిగొచ్చిన డీకే , డిప్యూటీ సీఎంగా ఓకే

Thursday, May 18, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గడిచిన వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కర్ణాటకలో అఖండ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌కు సీఎంను ఎంపిక చేయడం పెద్ద టాస్క్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లలో ఒకరిని సీఎంగా ఎంపిక చేయాల్సి రావడం.. ఇద్దరూ వెనక్కి తగ్గకపోవడంతో హైమాండ్‌కు తలబొప్పి కట్టింది. సుదీర్ఘ మంతనాల నేపథ్యంలో ఎట్టకేలకు డీకే శివకుమార్ మెత్తబడటంతో సిద్ధరామయ్యకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది. అలాగే రాష్ట్రానికి ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కొనసాగుతారని అధిష్టానం స్పష్టం చేసింది. ఎల్లుండి బెంగళూరులో సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.

పెద్దల రాయబారంతో మెత్తబడ్డ డీకే శివకుమార్ :

అయితే సీఎం పదవి తప్పించి తనకు మరేమి అక్కర్లేదని డీకే శివకుమార్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు సహకరించానని, తనపై కేసులు వున్నా బీజేపీతో పోరాడానని డీకే అధిష్టానం ముందు చెప్పారు. అలాగే 2018లో కొలువుదీరిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం వెనుక సిద్ధరామయ్య హస్తం వుందంటూ ఆధారాలతో సహా పెద్దల ముందు పెట్టారు శివకుమార్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే.. సిద్ధూ, డీకేలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో సీఎం పదవిని రెండున్నరేళ్లు ఒకరు, రెండున్నరేళ్లు మరొకరు పంచుకోవాలని అధిష్టానం చెప్పగా.. దీనికి ముందు తానంటే తానంటూ వీరిద్దరూ పట్టుబట్టినట్లుగా సమాచారం. ఎట్టకేలకు తొలుత సిద్ధరామయ్య సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు డీకే అంగీకరించినట్లుగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. ఆ తర్వాత రెండున్నరేళ్లు శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

సిద్ధరామయ్య వైపే సర్వేలన్నీ :

ఇప్పటికే సీఎంగా చేసిన అనుభవంతో పాటు ఇటీవల నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య వైపు మెజార్టీ శాతం మంది ప్రజలు మొగ్గుచూపారు . గతంలో 2013లో సీఎంగా ఐదేళ్ల పాటు పార్టీని నడిపారు. బీసీ నేత కావడం మరో అదనపు బలం. అయితే సీఎంగా వున్నప్పుడు సొంత సామాజిక వర్గానికి పదవులు కట్టబెట్టడం.. వక్కలిగ, లింగాయత్ వర్గాలను పట్టించుకోకపోవడం వంటివి ఆయనకు మైనస్‌గా మారాయి.

బీజేపీకి ఎదురొడ్డి నిలిచిన డీకే శివకుమార్ :

ఇక డీకే శివకుమార్ విషయానికి వస్తే.. వరుసగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయన సొంతం. అంతేకాకుండా కాంగ్రెస్‌ను కష్టకాలంలో ఆదుకోవడంలో ముందుండటం, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ఆయనకు పేరుంది. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో శివకుమార్ ఒకరు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన , రాష్ట్రంలోనే అత్యంత సంపన్నమైన రాజకీయ వేత్తగా నిలిచారు. గడ్డు పరిస్థితుల్లో పీసీసీ బాధ్యతలు చేపట్టిన శివకుమార్.. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరిగినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. 104 రోజుల పాటు తీహార్ జైల్లో వున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.