close
Choose your channels

బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

Wednesday, September 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

ఏపీ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటన ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకు ముందే.. విజయవాడ కనకదుర్గమ్మ వెండి రథంలోని నాలుగు సింహాల్లో ఏకంగా మూడు సింహాలు మాయమవడం కలకలం రేపుతోంది. దుర్గమ్మకు మూడు రథాలున్నాయి. వాటిలో ఈ వెండి రథం ఒకటి. శ్రీదుర్గామల్లేశ్వరులను ప్రతి ఉగాదికి ఈ రథంపైనే ఊరేగిస్తారు.

అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించలేదు. గతేడాది ఉగాదికి ఆది దంపతుల ఊరేగింపు పూర్తైన అనంతరం వెండి రథాన్ని మహామండపం ముందు నిలిపి.. టార్పాలిన్ కప్పేశారు. ఆ తరువాత ఆ వెండి రథం వైపు చూసిన నాథుడే లేకుండా పోయాడు. ఇటీవల అంతర్వేది ఘటన అనంతరం దుర్గ గుడిలోని రథాల భద్రత గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. పలు సూచనలు చేసిన అనంతరం వెండి రథాన్ని పరిశీలించేందుకు టార్పాలిన్ కవర్‌ తీయగా.. మూడు సింహాలు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. కనీసం సింహాల చోరీ ఎప్పుడు జరిగిందనే విషయం కూడా అధికారులకు తెలియకపోవడం విస్మయం కలిగిస్తోంది. కరోనా లాక్‌డన్ కారణంగా దర్శనాలు కూడా లేవు. దీనినే దొంగలు అవకాశం తీసుకుని ఉంటారని తెలుస్తోంది. ఆలయ అధికారులు మాత్రం దీనిపై గోప్యత పాటిస్తున్నారు. వెండి రథంపై సింహాలు చోరీకి గురైందీ లేనిది తేలడానికి మూడు రోజులు పడుతుందని ఈవో సురేష్‌బాబు మీడియాకు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.