close
Choose your channels

కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ... 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామా చేయాలని సోనియా ఆదేశం

Wednesday, March 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిద్రలేచింది. ఈ మేరకు పార్టీ ప్రక్షాళనకు ఉపక్రమించింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలైనన ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ పీసీసీ చీఫ్‌లు తక్షణమే వారి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీని మళ్లీ పునర్నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రక్షాళన మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన వచ్చిన కాసేపటికే ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గణేశ్ గొదియాల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందే గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ సైతం పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు.

ఇకపోతే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. చివరిసారిగా గతేడాది అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఘోర పరాజయానికి కారణాలు, భవిష్యత్తు వ్యూహాలు వంటి కీలక అంశాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చించారు. త్వరలోనే కాంగ్రెస్ పూర్తి స్థాయి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు సోనియా గాంధీనే కాంగ్రెస్‌కు సారథ్యం వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే సోనియా యాక్షన్‌లోకి దిగారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.