close
Choose your channels

పొలిటికల్ టర్న్ తీసుకున్న సోనూసూద్ ట్రాక్టర్ వ్యవహారం

Monday, July 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పొలిటికల్ టర్న్ తీసుకున్న సోనూసూద్ ట్రాక్టర్ వ్యవహారం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పేరు ‘సోనూసూద్’. విలన్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కరోనా మహమ్మారి ఇండియాలోకి అడుగుపెట్టడంతో రియల్ లైఫ్ హీరోగా ఎనలేని ఖ్యాతిని గడించారు. అయితే తాజాగా తను చూపిన ఉదాత్త గుణంతో మరోమారు సోనూసూద్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. చిత్తూరు జిల్లా మహల్‌రాజపల్లిలో నాగేశ్వరరావు అనే రైతు తన కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దానిని చూసిన సోనూ చలించిపోయి వారికి జత ఎద్దులను కొనిస్తానని హామీ ఇచ్చి.. కొద్దిసేపటికే ఎడ్లను బదులు ట్రాక్టర్‌ కొనిస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిందే తడవుగా సోనాలికా ట్రాక్టర్‌ను కొనిచ్చారు. అంతా చకచకా కమ్ అండ్ గో లాగా అయిపోయింది.

అసలు చిక్కంతా ఎక్కడొచ్చిందంటే..

సోనూసూద్ ట్రాక్టర్ కొనిచ్చిన వ్యవహారం సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ విపరీతంగా కథనాలొచ్చాయి. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై స్పందించారు. ట్విట్టర్ ద్వారా.. ఆపై ఫోన్ చేసి.. దీనితో పాటు ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనూను లైవ్‌లో అభినందించి ఆయనపై ప్రశంసలు గుప్పించారు. అంతే కాదు.. నాగేశ్వరరావు ఇద్దరి కూతుళ్లు చదువు బాధ్యతను ఇకపై తానే తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో కథ మొదలైంది. ఒక్కసారే వైసీపీ రంగంలోకి దిగింది. నాగేశ్వరరావేమీ నిరుపేద కాదు.. అసలు ఆయన కూతుళ్లు కాడెద్దులుగా మారి అరక దున్నుతున్న వీడియోను వాళ్లేదో సరదాగా తీసుకున్నారు. నాగేశ్వరరావు కుటుంబానికి అందని పథకమంటూ లేదు.. ఇవిగో ఆధారాలంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు.

నాగేశ్వరరావు పేరుతో కూడా ఓ న్యూస్ వైరల్..

ట్రాక్టర్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో నాగేశ్వరరావు పేరుతో కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. నాగేశ్వరరావు పేరిట వైరల్ అవుతున్న ఆ న్యూస్‌లో ఏముందంటే.. ‘‘నేనొక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 1.87 సెంట్లు భూమిని నా తండ్రి రామయ్యకు ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూమినే మేము సాగు చేసుకుంటున్నాం. నాకు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాల్లో మార్పుకోసం ఒకసారి లోక్ సత్తా పార్టీ నుంచి పోటీ చెయ్యడం జరిగింది. ప్రస్తుతం మదనపల్లిలో ఒక టీ దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నా. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం నాపై.. నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఏది ఏమైనా ఈ వ్యవహారం ఎన్ని రాజకీయ మలుపులు తీసుకున్నా.. సోనూసూద్ చేసిన సాయం మాత్రం ఎన్నటికీ మరువలేనిది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.