స్పెయిన్ యువరాణిని బలితీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా కాటుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే కన్నుమూశారు. అయితే తాజాగా కరోనాతో ఇన్నిరోజులు పోరాడిన స్పెయిన్ యువరాణి మారియా థెరీసా ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. ప్రపంచంలో కరోనా బారిన పడి మరణించిన మొదటి రాయల్ మరణం ఇదే. ఆమె వయస్సు 86 సంవత్సరాలు. కాగా వచ్చే శుక్రవారం అనగా ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. జులై 28, 1933లో జన్మించిన ఆమె.. ప్రాన్స్‌లో విద్యాభ్యాసం చేశారు.

చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్‌కు ధనిక, పేద అనే తారతమ్యాలు లేవు. సామాన్యుల నుంచి ముఖ్య నేతల వరకు అందరికీ వ్యాపిస్తోంది. ఇప్పటికే.. బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు, బ్రిటన్ ప్రధాని బోరిస్‌కు, ఆరోగ్యశాఖ మంత్రికి కూడా ఈ వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ వైరస్‌తో స్పెయిన్ దేశం అతలాకుతలం అవుతోంది. స్పెయిన్‌లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. స్పెయిన్‌లో ఇప్పటివరకు 73 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. 5,982 మంది మృతి చెందారు.