close
Choose your channels

ప్రజా ఉద్యమాలతోనే ‘ప్రత్యేక హోదా’ సాధ్యం.. ప్రశ్నిస్తా!

Monday, June 24, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజా ఉద్యమాలతోనే ‘ప్రత్యేక హోదా’ సాధ్యం.. ప్రశ్నిస్తా!

ప్రజా ఉద్యమాలతోనే ప్రత్యేక హోదాను సాధించగలమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. హోదా అనేది ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కని.. ప్రజా ఉద్యమం మొద‌లైతే దానిని ముందుకు తీసుకెళ్లడానికి జనసేన సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేక హోదాపై అన్నిపార్టీలూ మాట‌ మార్చినా హోదా డిమాండ్‌కు క‌ట్టుబ‌డి ఉన్న ఏకైక పార్టీ జ‌న‌సేన పార్టీ మాత్రమేనన్నారు. హోదాపై మాటలు మారుస్తున్న నాయకులకి ప్రజలే ఎదురు తిరగాలన్నారు. సోమ‌వారం విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యంలో పవన్ మీడియా స‌మావేశం నిర్వహించారు. "గెలుపోట‌ములు రాజ‌కీయాల్లో స‌హ‌జం. సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేన పార్టీని ఏర్పాటు చేశాను. న‌న్ను న‌మ్మి ఓట్లు వేసిన యువత ఆశ‌యాలు, ఆకాంక్షలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే నా ల‌క్ష్యం. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్దతు ఇచ్చాను కాబట్టే నైతిక బాధ్యతతో గట్టిగా ప్రశ్నించాను. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, పాలసీలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కొంత సమయం తీసుకున్నాం. దాదాపు సంవత్సరం వరకూ ప్రశ్నించకుండా ఉన్నాను. అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా తగినంత సమయం ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే కచ్చితంగా హర్షిస్తాం. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏమి ఉన్నా ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నాం" అని జనసేనాని తెలిపారు.

అన్ని కట్టడాలు కూల్చాల్సిందే..

"రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఏ విధంగా ఇచ్చారో ప్రభుత్వం ప్రజ‌ల‌కు వివరణ ఇవ్వాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నితమైన, పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని క్షేత్ర స్థాయిలో అందరితో మాట్లాడి మా కార్యచరణ, ప్రణాళికను కొద్ది నెలల్లో ముందుకు తీసుకు వెళ్తాం.
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ పేరిట అక్రమ క‌ట్టడాలు కూల్చేయ‌డం మంచి ప‌రిణామ‌మే, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ క‌ట్టడాలు కూల్చేయాలి లేక‌పోతే ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుంది. జ‌న‌సైనికులు, ప్రజ‌ల‌కు మాటిస్తున్నా ప్రజా స‌మ‌స్యల‌పై పోరాటం చేసేందుకు జ‌న‌సేన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది" అని పవన్ చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.