శ్రీలంక పోలీస్‌ చీఫ్‌ రాజీనామా.. ఆ ఇద్దరూ చనిపోయారు!

  • IndiaGlitz, [Saturday,April 27 2019]

శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయని పదిరోజులు ముందే హెచ్చరికలు వచ్చినప్పటికీ ఎవరూ దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. అంతకు రెండు, మూడు రెట్టింపు మంది క్షతగాత్రులై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పేలుళ్ల ఘటనకు తన తప్పిదమేనని బాధ్యత వహిస్తూ శ్రీలంక పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభుత్వం ఆ దాడులను నివారించలేకపోయిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని.. పోలీస్‌ చీఫ్, రక్షణ శాఖ సెక్రటరీని రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో శుక్రవారం పోలీస్ చీఫ్ పుజిత్ జయసుందర రాజీనామా చేశారు. కాగా.. గురువారం నాడు రక్షణ శాఖ సెక్రటరీ హేమసిరి ఫెర్నాండో రాజీనామా చేసిన విషయం విదితమే.

ఇంటింటినీ తనిఖీ చేస్తాం.. ఆ ఇద్దరూ చనిపోయారు!

ఈ సందర్భంగా మైత్రిపాల సిరిసేన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించారు. లంకలోకి ఈ ఉగ్రవాది చొరబడి ఈ దారుణానికి పాల్పడటానికి ప్రభుత్వ వ్యవహారశైలే కారణమన్నారు. ఇంత వరకూ దేశంలో ఎన్నో కేసుల్లో పురోగతి సాధించామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాగా.. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సంయుక్త ఆపరేషన్స్‌ కమాండ్‌ను ఏర్పాటుచేస్తామని.. అంతేకాదు ప్రజల భద్రత దృష్ట్యా ఇంటింటిని తనిఖీ చేస్తామని సిరిసేన స్పష్టం చేశారు.

కాగా.. నేషనల్‌ తౌహీద్‌ జమాత్‌(ఎన్టీజే) చీఫ్‌ జహ్రాన్‌ హషీమ్‌(40) ఈ ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు. షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్‌ అహ్మద్‌ ఇబ్రహీం అనే ఆత్మాహుతి బాంబర్‌తోపాటు, జహ్రాన్‌ కూడా ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే చనిపోయారని సిరిసేన తెలిపారు. ఆత్మాహుతిదాడుల నేపథ్యంలో ముస్లిం సమాజంపై ఉగ్రవాదులుగా ముద్రవేయవద్దని శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన దేశ ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.