ఆరేళ్ల తరువాత.. సునీల్ అలా

  • IndiaGlitz, [Thursday,September 14 2017]

అందాల రాముడు, మ‌ర్యాద రామ‌న్న చిత్రాల‌తో క‌థానాయ‌కుడిగా మంచి పేరు తీసుకున్నాడు సునీల్‌. ఆ చిత్రాలు విడుద‌లైన స‌మ‌యంలోనూ హాస్య న‌టుడిగా వేషాలు వేసిన సునీల్‌.. పూల‌రంగ‌డు నుంచి వ‌రుస‌గా క‌థానాయ‌కుడిగానే సినిమాలు చేస్తున్నాడు. అయితే సునీల్ క‌ష్టానికి త‌గ్గ ఫలితాలైతే ఆ సినిమాలేవీ ఇవ్వ‌లేక‌పోయాయి. రేపు ఆయ‌న న‌టించిన కొత్త చిత్రం ఉంగ‌రాల రాంబాబు విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రంపైన చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు సునీల్‌.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏడాదికి రెండు సినిమాల్లో హీరోగా న‌టిస్తూనే.. క‌మెడీయ‌న్‌గానూ సినిమాలు చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. 2011లో వ‌చ్చిన మిర‌ప‌కాయ్ త‌రువాత కామెడీ వేషాల‌కు దూర‌మైన సునీల్‌.. మ‌ళ్లీ ఆరేళ్ల త‌రువాత ఆ వైపుగా అడుగులు వేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించ‌బోతున్న చిత్రంతో సునీల్ తిరిగి క‌మెడీయ‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్రివిక్ర‌మ్ చిత్రాల‌తోనే హాస్య‌న‌టుడిగా మంచి పేరు తెచ్చుకున్న సునీల్‌.. ఖ‌లేజా త‌రువాత త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో చేయ‌బోయే సినిమా తార‌క్‌దే కావ‌డం విశేషం.