సుష్మాకు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మాజీ మంత్రి, సాయం అడిగితే కాదనకుండా చేసే సుష్మాస్వరాజ్ అలియాస్ చిన్నమ్మ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. బుధవారం సాయంత్రం ఢిల్లీలో లోధి రోడ్డులోని శ్మశానవాటికలో పోలీసు బలగాల గౌరవ వందనం అనంతరం అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. చిన్నమ్మ అంతిమ సంస్కారాలను ఆమె కుమార్తె బన్సూరీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్తె, భర్త ఇద్దరూ సుష్మాకు కడసారి సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్సింగ్ తదితరులు విషణ్ణ వదనంతో హాజరయ్యారు.
అంతకుముందు సుష్మా పార్థివ దేహాన్ని ఆమె ఇంటి నుంచి బీజేపీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆమెను కడసారి చూసేందుకు నాయకులు, కార్యకర్తలు, వీరాభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచిన సుష్మా పార్థివ దేహాన్ని లోధి రోడ్డులోని శ్మశానవాటికకు వరకు అంతిమ యాత్ర నిర్వహించారు.
కాగా.. సుష్మా స్వరాజ్ మరణం పట్ల పాకిస్థాన్ శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ సంతాపం వ్యక్తం చేయడం విశేషమని చెప్పుకోవచ్చు. శత్రుదేశమైన పాక్ వ్యక్తి కూడా చిన్నమ్మకు సంతాపం తెలిపారంటే ఆమె మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ట్విటర్ వేదికగా ఆమెతో వాగ్వివాదానికి దిగే అవకాశం కోల్పోతున్నానని గత అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయన... సుష్మాస్వరాజ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని హుస్సేన్ ట్వీట్ చేశారు.
మరోవైపు.. చిన్నమ్మ మృతికి ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా కూడా సంతాపం తెలిపి.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రజల పట్ల ఎంతో దయ, స్నేహభావంతో మెలిగేవారని సుష్మా సేవలను దలైలామా కొనియాడారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా సంతాపం తెలిపింది. దేశం ఇటీవల తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పట్ల సుష్మా స్వరాజ్ చాలా ఆనందం వ్యక్తం చేశారని పేర్కొంది. ఆమె కుటుంబానికి ఓ ప్రకటనలో తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.