close
Choose your channels

టీడీపీ పెద్దాయనకు అశ్రు నివాళి.. యడ్లపాటి పాడె మోసిన చంద్రబాబు

Wednesday, March 2, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంక్రటావు అంత్యక్రియలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని యడ్లపాటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ జెండాను యడ్లపాటి పార్థివదేహంపై ఉంచిన చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా యడ్లపాటి పాడెను టీడీపీ అధినేత మోశారు.

తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని శ్మశానవాటికలో యడ్లపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. వెంకట్రావు నివాసం నుంచి శ్మశానవాటిక వరకు సాగిన అంతిమయాత్రలో చంద్రబాబు కాలినడకన నడిచి పాల్గొన్నారు. మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్‌, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం తదితరులు యడ్లపాటికి నివాళులర్పించిన వారిలో వున్నారు.

గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యడ్లపాటి వెంకట్రావు హైదరాబాద్‌లో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులతో పాటు మంత్రిగానూ వెంకట్రావు పనిచేశారు. రైతు నాయకుడిగానూ.. సంగం డెయిరీకి వ్యవస్థాపక ఛైర్మన్‌గా సేవలందించారు.

1919 డిసెంబర్‌ 16న గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించారు వెంకట్రావు. తల్లిదండ్రులు యడ్లపాటి వెంకట సుబ్బయ్య, రాఘవమ్మ. గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ చదివిన ఆయన.. అనంతరం మద్రాసు లా కాలేజీలో చదువుతూ అందులో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. అలవేలు మంగమ్మను పెళ్లాడిన వెంకట్రావుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీ రంగా ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకట్రావు 1967, 1972 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరఫున.. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978-80 మధ్యకాలంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1983లో ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా.. 1995లో గుంటూరు జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. వయోభారంతో 2004 నుంచి క్రియాశీల రాజకీయాలకు వెంకట్రావు దూరంగా ఉన్నారు.  యడ్లపాటి వెంకట్రావు మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.