టీడీపీ ఉద్ధండులు సంచలన నిర్ణయం.. త్వరలో బీజేపీలోకి!!

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ విజయ దుందుభి మోగించగా.. టీడీపీ, జనసేన పార్టీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ఆయా పార్టీల నేతలు జంపింగ్‌లు చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి ఒకరిద్దరు రాజీనామా చేసి రాజకీయాలకు దూరమవ్వగా.. మరోవైపు టీడీపీలో ఇన్నాళ్లు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అనుభవించి ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూడటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

వైసీపీలో హౌస్‌ఫుల్!

2019 ఎన్నికల్లో ‘సైకిల్’కు పంచర్లు వేసుకునేందుకు కూడా వీల్లేకుండా గట్టిగానే దెబ్బ తగిలింది. బహుశా ఈ దెబ్బల నుంచి కోలుకునేందుకు ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. అసలు ఈ దెబ్బల నుంచి కోలుకుంటుందా లేదా అన్నది మిలియన్ డాల్లర్ ప్రశ్నగానే మిగిలిపోతుందేమో. దీంతో అటు అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుుకు దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. టికెట్ల దక్కని నేతలు, ద్వితియ శ్రేణి నేతలతో వైసీపీ హౌస్‌ ఫుల్ అయ్యింది. ప్రస్తుతానికి వైసీపీలోకి వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోవడంతో ఎలాగో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు వీళ్లేకపోవడంతో.. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి అయినా వెళ్లి చేరేందుకు కొందరు కీలకనేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అట్టర్ ప్లాప్ అయ్యారు!

వీరిలో అనంతపురం జిల్లాను సుమారు 20 ఏళ్లకు పైగా ఏలిన జేసీ బ్రదర్స్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావ్, కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురు ప్రముఖ నేతలు ఉన్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరూ తమ వారసులను పోటీచేయించగా ఇద్దరూ ఓడిపోయారు. చిలకలూరిపేట నుంచి పోటీచేసిన ప్రత్తిపాటిని కంచుకోటను రజనీ విడదల బద్దలు కొట్టి వైసీపీ జెండా పాతారు. మరోవైపు 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకుని మంత్రి పదవి దక్కించుకున్న ఆది నారాయణరెడ్డి ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీచేసి అడ్రగస్ గల్లంతు చేసుకున్నారు.

తప్పించుకోవచ్చని ప్లాన్!

దీంతో వీళ్లంతా ఇక టీడీపీలో ఉండటం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని భావించారట. అందుకే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 11 లేదా 12న కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని సమాచారం. కాగా గతంలో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారిపై చాలా వరకు అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీంతో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ తమ మీద పడుతుందో అని భావించిన వారు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే తప్పించుకోవచ్చని భావిస్తున్నారని తెలుస్తోంది. పైగా.. కేంద్రంలో అధికారంలో ఉంది గనుక ఎలాగో ఏదో ఒక కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ నాలుగు పైసలు సంపాదించుకోవచ్చని ప్లాన్ వేశారట. సో.. ఈ వార్తల్లో ఏ మేరకు నిజముందో..? ఎవరెవరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో అనేదానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.