close
Choose your channels

టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఉలిక్కిపడిన పార్టీ శ్రేణులు, స్పందించిన నారా లోకేష్

Saturday, March 19, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆధునిక యుగంలో అంత డిజిటల్‌గా మారిపోయిన తర్వాత సౌకర్యాలు పెరగడంతో పాటు నేరస్తుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. సెలబ్రెటీలు, ధనవంతులు, వ్యాపారవేత్తల సోషల్ మీడియా ఖాతాలతో పాటు బ్యాంకు అకౌంట్లను కొందరు సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ వెబ్‌‌సైట్లు, రాజకీయ పార్టీల సోషల్ మీడియా ఖాతాలను కూడా దుండగులు హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ సైబర్ నేరగాళ్ల బారినపడింది.

వివరాల్లోకి వెళితే.. టీడీపీ అధికారిక ట్విట్టర్ నుంచి విచిత్రమైన పోస్టులు కనిపించడంతో పార్టీ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. టీడీపీ ట్విట్టర్ నుంచి ఏకంగా టెస్లా, స్పేస్ ఎక్స్‌ల అధినేత ఎలన్ మస్క్‌కు ట్వీట్లు చేశారు హ్యాకర్లు. స్టార్‌షిప్ ఫుల్ స్టాక్ టెస్టింగ్ జరుగుతుందని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేయగా గ్రేట్ జాబ్, సూపర్ అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి రెస్పాన్స్ రావడంతో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తమ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని వెల్లడించారు. ట్విట్టర్ ఇండియాకు విషయం తెలిపామని, త్వరలోనే ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తారని లోకేశ్ ట్వీట్ చేశారు.

మరోవైపు ఏపీలో పెగాసస్ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ పెగాసస్ అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో హీట్‌ను పెంచేశాయి. అధికార వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అదే సమయంలో తమ ఫోన్లను అధికార వైసీపీ ట్యాపింగ్ చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.