తొడగొట్టి చెబుతున్నా తెలుగుదేశందే గెలుపు..!

  • IndiaGlitz, [Monday,May 20 2019]

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ సర్వేను వెల్లడించాయి. అయితే ఫలితాలు వెల్లడించిన సర్వేల్లో ఒకటి అర మాత్రమే టీడీపీ గెలుస్తుందని చెప్పగా.. వైసీపీ అధికారంలోకి అవకశాలు ఎక్కువ ఉన్నాయని జాతీయ మీడియా సైతం కోడై కూస్తోంది. మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాచించిన లగడపాటి రాజగోపాల్ కూడా టీడీపీనే గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియా సర్వేలు నమ్మలేమని టీడీపీ, వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసరడం.. మరికొందరు తొడగొట్టడం చేస్తున్నారు.

130 సీట్లు మాకొస్తాయ్..!

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న మాట్లాడుతూ జాతీయ మీడియాలో వచ్చిన సర్వేలు వాస్తవం కాదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్పిన సర్వేలకు క్రేడిబిలిటీ ఎక్కువ.. మిగతా సర్వేలన్నీ నమ్మశక్యంగా లేవన్నారు. అంతేకాదు టీడీపీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి రాజగోపాల్ సర్వే కరెక్ట్ కాదని బుద్ధా చెప్పడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో కచ్చితంగా మాకు 130 సీట్స్ వస్తున్నాయని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ సందర్భంగా 2014 ఎన్నికల ప్రస్తావన తెచ్చిన బుద్దా.. ఆ ఎన్నికల్లో వైసీపీ నెగ్గుతుందని సర్వేలు తేల్చాయని తీరా చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

తొడగొట్టి చెబుతున్నా..!

అంతటితో ఆగని బుద్దా ప్రెస్‌మీట్‌లో అందరూ చూస్తుండగానే పైకి లేచి.. 130 ఎమ్మెల్యే సీట్లతో టీడీపీ అధికారంలోకి వస్తుందని తొడగొట్టి మరీ చెప్పారు. 4వ సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని బుద్దా జోస్యం చెప్పారు. ఎన్డీఏకు తక్కువగా వస్తున్నాయని.. అయితే ఎగ్జిట్ పోల్స్‌లో కావాలని ప్రధాని నరేంద్ర మోదీ హైప్ చేయించారని ఆయనపై నెపం నెట్టేయడం గమనార్హం. ఇటు రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వేలు మోదీ ఆదేశాల మేరకే అలా చెప్పాయని బుద్దా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తున్నామని వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మహిళలంతా టీడీపీకే ఓట్లు వేసి మరోసారి పట్టం కట్టారని బుద్దా స్పష్టం వేశారు.

కాగా.. తొడగొట్టి సర్వే ఫలితాలు చెప్పడంపై అహంతో బుద్దా అలా ప్రవర్తించారని ఇలా చేయడం సబబు కాదని నెటిజన్లు, దుమ్మెత్తిపోస్తున్నారు. సో.. బుద్దా వెంకన్న మే-23వరకు ఇలానే ఉంటారో..? ఇలానే తొడగొడతారో వేచి చూడాల్సిందే మరి.