వేగంగా వస్తున్న ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ చిన్నారిని కాపాడిన పాయింట్స్ మ్యాన్..

  • IndiaGlitz, [Tuesday,April 20 2021]

కొన్ని స్టంట్స్ సినిమాల్లో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అది జస్ట్ మూవీ కోసం.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తేనే చూస్తున్న మనకు వెన్నుముక నిటారుగా అయిపోయి.. గూస్‌బంప్స్ వచ్చేస్తాయి, అలాంటిది నిజ జీవితంలో జరిగితే.. వావ్ ఆ గట్స్‌కి ఫిదా అయిపోవాల్సిందే. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పట్టాలపైకి ట్రైన్ వస్తోందంటేనే ఫ్లాట్ ఫామ్‌పై ఉన్న మనం కొన్ని అడుగుల దూరం వెనక్కి జరుగుతాం. అలాంటిది ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ పట్టాలపై పడిపోయిన చిన్నారిని రక్షించి రెప్పపాటులో తను కూడా ప్రమాదం నుంచి బయటపడ్డాడో వ్యక్తి.

అది ముంబై వాంఘాని రైల్వే స్టేషన్. ఫ్లాట్‌ఫాంపై అంధురాలైన తన తల్లితో కలిసి నడుస్తూ వెళుతున్న ఓ చిన్నారి సడెన్‌గా పట్టాలపై పడిపోయాడు. అదే పట్టాలపైకి ట్రైన్ దూసుకొస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన పాయింట్స్ మ్యాన్ మయూర్ షెల్కే మెరుపు వేగంతో ట్రైన్‌కు ఎదురుగా వెళ్లి చిన్నారిని కాపాడి.. రెప్పపాటులో తను కూడా పట్టాలపైకి ఎక్కి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో చూసిన వారికి గూస్‌బంప్స్ రావడం ఖాయం. వేగంలో ఒక్క సెకన్ అటు ఇటు అయినా కూడా మయూర్ ప్రాణాలతో ఉండేవారు కాదు.

ప్రస్తుతం ట్రైన్‌కు మయూర్ ఎదురెళ్లి మరీ చిన్నారిని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మయూర్ ఒక రియల్ హీరో అని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రైల్వే ఉన్నతాధికారులు సైతం మయూర్ సాహసాన్ని గుర్తించారు. అభినందించడమే కాకుండా అవార్డులను సైతం ప్రకటించారు. మయూర్ షెల్కే జీఎం అవార్డు, రైల్వే బోర్డు సేఫ్టీ అవార్డుకు ఎంపికయ్యారు. రైల్వే మంత్రి ఆయనకు రూ.50 వేల రివార్డును సైతం ప్రకటించారు.