close
Choose your channels

మదనపల్లె ఘటన వెనుక విస్తుగొలిపే విషయాలు

Tuesday, January 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మదనపల్లె ఘటన వెనుక విస్తుగొలిపే విషయాలు

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదివారం జరిగిన అక్కాచెల్లెళ్ల జంట హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతకు ముందు వారం రోజుల క్రితం జరిగిన అక్కా చెల్లెళ్లు మూడు రోడ్ల కూడలిలో ముగ్గులో ఉంచిన నిమ్మకాయ తొక్కిన ఘటన ఈ హత్యలకు కారణమైంది. నిజానికి ఆ ఘటనను నిర్లక్ష్యరాస్యులు సైతం పెద్దగా పట్టించుకోరు. కానీ ఉన్నత విద్యావంతులై ఉండి.. తండ్రి డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ.. తల్లి ఓ విద్యాసంస్థకు కరస్పాడెంట్‌గా... ఉన్నత విద్యను అభ్యసించిన వీరి పిల్లలు దీనిని భూతద్దంలో చూశారు. అంతటి విద్యావంతులు సైతం మూఢనమ్మకాలకు పోయి ఏకంగా కన్నబిడ్డలనే హతమార్చడం.. సంచలనంగా మారింది.

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో..

వారం క్రితం పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్య తమ పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో మూడు రోడ్ల కూడలిలో వేసిన ముగ్గులో ఉంచిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ తొక్కారు. ఈ విషయాన్ని ఇంటికి తిరిగి రాగానే తమ తల్లిదండ్రులకు వివరించారు. ఆ యువతులిద్దరికీ అప్పటి నుంచి తమకేదైనా అవుతుందనే భయం పట్టుకుంది. అప్పటి నుంచి అలేఖ్య పూర్తిగా మౌనంగా ఉంటోంది. సాయిదివ్య సైతం ఇంట్లో దెయ్యాలున్నాయంటూ భయబ్రాంతులకు గురయ్యేది. విషయాన్ని పురుషోత్తంనాయుడు తన సహ అధ్యాపకుడికి చెప్పగా.. ఆయన వారించారు. అనంతరం తమిళనాడుకు చెందిన ఓ మంత్రగాడిని సంప్రదించి తాయత్తు వేయించారు. యువతులు నిమ్మకాయ తొక్కినప్పటి నుంచి వారి తల్లిదండ్రులు విధులకు వెళ్లడమే మానేశారు.

చెల్లిని బతికించి తీసుకొస్తానని తననూ చంపేయాలన్న అలేఖ్య..

ఆదివారమంతా పూజలు నిర్వహించి.. అదే రోజున హత్యలు చేశారు. ఆ రోజు ఇంట్లో పూజలు చేస్తుండగా.. పై అంతస్తులో సాయి దివ్య మ్యూజిక్ వాయిస్తూ ఉంది. ఉన్నట్టుండి అరుస్తూ కేకలేసింది. తల్లిదండ్రులూ, అలేఖ్య కలిసి ఆమెకు దయ్యం ఆవహించిందని డంబెల్‌తో కొట్టారు. దీంతో సాయిదివ్య ప్రాణాలు కోల్పోయింది. నిమ్మకాయ తొక్కినప్పటి నుంచి అంటే వారం రోజులుగా మౌనంగా ఉన్న అలేఖ్య అప్పుడు నోరు తెరిచింది. చెల్లిని బతికించి తీసుకొస్తానని తననూ చంపాలని తల్లిని కోరింది. ముగ్గురూ నగ్నంగా ఇంట్లో పూజలు నిర్వహించారు. అనంతరం అలేఖ్య నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి, అందులో నవధాన్యాలు పోసి.. తలపై డంబెల్‌తో కొట్టడంతో ఆమె కూడా చనిపోయింది. ఈ ఘోరమంతా 4:30కు జరగగా.. 7 గంటలకు పురుషోత్తం తన సహ అధ్యాపకుడికి చెప్పారు. ఆయన వచ్చి జంట హత్యలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు పద్మజ షాక్ ఇచ్చారు. తమ బిడ్డలిద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారని... సోమవారం తిరిగి తీసుకొస్తానని మృతదేహాలను తరలించవద్దని చెప్పింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. అర్ధరాత్రి శవాలను బయటకు తరలించి.. పోస్టుమార్టం అయిన తరువాత అంత్యక్రియలు పూర్తి చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.