ధోనీ అభిమానులను హర్ట్ చేసిన ట్రంప్ మాటలు!

సబర్మతీ ఆశ్రమం సందర్శనం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, మెలానియా గుజరాత్‌లోని మెతెరా స్టేడియం చేరుకున్నారు. అక్కడ జరగుతున్న ‘నమస్తే ట్రంప్’ పాల్గొన్నారు. మొదట మోదీ మాట్లాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ట్రంప్‌ కూడా ప్రసంగించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్ గురించి మాట్లాడిన ట్రంప్.. భారత్ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లీ పేర్లు ప్రస్తావనకు తెచ్చారు. అయితే యావత్ ప్రపంచంలో మార్మోగిన ధోనీ.. ఆయనతో పాటు గంగూలి లాంటి పెద్దలను మరిచారు. దీంతో ధోనీ, గంగూలీ, సెహ్వాగ్ అభిమానులు ఒకింత హర్ట్ అయ్యారు. బహుశా.. ‘ఎంతో మంది గొప్ప క్రికెటర్లు’ అని ఒక్క మాట అనేసి మిన్నకుండి ఉంటే బాగుండేదేమో..!

ఇంతకీ ఏమన్నారు..!?

‘కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనడానికి మోదీయే నిదర్శనం. పారిశుద్ధ్యం, పేదరిక తగ్గుదలలో మోదీ అద్భుత విజయాలు సాధిస్తున్నారు. భారత్‌ అద్భుతమైన అవకాశాలకు నెలవు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చి తన కలలను సాకారం చేసుకునే దిశగా భారతావని తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజల హక్కుల రక్షణలో ఇరు దేశాలకు ఉన్న శ్రద్ధే భారత్, అమెరికాలను స్నేహితులుగా మార్చాయి’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా క్రికెట్ ప్రస్తావన కూడా తెచ్చారు. సచిన్‌, కోహ్లీ వంటి గొప్ప క్రికెటర్లు భారత్‌లో ఉన్నారని చెప్పారు. అంతేకాదు.. భారత్‌లో ఒక్కో విజయానికి ప్రతీకగా ఒక్కో పండుగ జరుపుకుంటారని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికాకు గుజరాతీలు అందించిన సహకారం చాలా గొప్పదని తెలిపారు. ఇవాళ సాయంత్రం ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శిస్తానని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మైదానంలో తనకు స్వాగతం పలికారని ట్రంప్ తెలిపారు.