close
Choose your channels

ఆర్టీసీని ప్రైవేటీకరించం.. సెలవులే సెలవులు!!

Saturday, October 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్టీసీని ప్రైవేటీకరించం.. సెలవులే సెలవులు!!

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె విరమణకు ససేమిరా అంటుండగా.. ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే పరిస్థితి లేదని కేసీఆర్ సర్కార్ మొండికేసి కూర్చున్న విషయం విదితమే. ఈ క్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పనని తేల్చిచెప్పేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ఈ విషయం చెప్పలేదన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం ఎప్పుడు చెప్పలేదని.. ఆర్టీని కాపాడుకుంటామని సంస్థను ప్రైవేటుపరం చేయమని మంత్రి తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా!?

‘ఆర్టీసీ సమ్మెను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాము. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. సమ్మెను ప్రయాణీకుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారు. ప్రజా రవాణా వ్యవస్థ కుంటుపడకుండా 7,358 ప్రైవేట్ వాహనాలను నడుపుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ.4416 కోట్లు. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తారని అనుకున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఇచ్చింది. మేము చర్చలకు సానుకూలంగా ఉన్నా, కార్మిక సంఘాల నేతలే చర్చల నుంచి వైదొలగి వెళ్లిపోయారు. మాపై విపక్షాలు చేస్తున్న విమర్శల్లో పసలేదు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా?. కమ్యూనిస్టులు పాలిస్తున్న కేరళలో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 2018లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఓసారి ప్రతిపక్షాలు గుర్తెరగాలి’ అని ఈ సందర్భంగా రవాణా మంత్రి స్పష్టం చేశారు.

సెలవులే సెలవులు!

ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టడంతో ప్రజా రవాణా కుంటుపడింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి పూర్తిస్థాయిలో లేవని విమర్శలు వస్తున్నాయి. దీంతో విద్యాసంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో 15వ తేదీ వరకు సెలవులు పొడిగించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.