close
Choose your channels

వైఎస్ కోరికను జగన్ ముందుంచిన ఉండవల్లి!

Wednesday, February 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్ కోరికను జగన్ ముందుంచిన ఉండవల్లి!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ఇందులో పలు విషయాలను ప్రస్తావించిన ఆయన.. తన వినతిని స్వీకరించి అమలు చేయాలని కోరారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానంటూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైకోర్టును కర్నూలుకు తరలించి న్యాయ రాజధాని చేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్రం ఆమోదిస్తే చకచకా పనులు జరిగిపోనున్నాయ్. ఈ క్రమంలో జగన్‌ ముందు ఓ సరికొత్త డిమాండ్‌ను ఉండవల్లి ఉంచారు. అదేమిటంటే.. రాజమండ్రిలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరారు.

నాన్నగారి కోరికను నెరవేర్చు!

రాజమండ్రిలో హైకోర్టు బెంచిని ఏర్పాటు చేయాలన్నది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి కోరిక అని... ఆ కోరికను మీరు నెరవేర్చాలని జగన్‌కు రాసిన లేఖలో ఉండవల్లి పేర్కొన్నారు. కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. 14 ఏళ్ల క్రితమే వైఎస్ ఈ రకమైన ఆలోచన చేశారని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తుచేశారు. వైఎస్‌కు ఉండవల్లి అత్యంత ఆప్తుడనే విషయం తెలిసిందే.

మరికొన్ని..!

హైకోర్టు బెంచ్‌ అంశంతో పాటు.. మరికొన్ని విషయాలను ఉండవల్లి ప్రస్తావనకు తెచ్చారు. రాజమండ్రిలో ఇసుక లభించడం లేదని... కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొందని.. దీన్ని సీరియస్‌గా తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని లేఖలో కోరారు. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ విషయంలో కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం జగన్‌కు ఉండవల్లి సూచించారు.

స్పందించి.. చేస్తారా!?

వాస్తవానికి ఉండవల్లి అంటే జగన్‌కు బాగా అభిమానమని.. గతంలో అజయ్ కల్లాంను ప్రభుత్వంలోకి తీసుకోవాలని సూచించగా.. ఆయన చెప్పినట్లుగానే జగన్ కల్లాంను తీసుకుని కేబినెట్ హోదా అనగా ముఖ్య సలహాదారుడిగా తీసుకోవడం జరిగింది. అయితే తాజాగా.. ఉండవల్లి లేఖలో ప్రస్తావించిన అంశాలపై జగన్ ఎలా స్పందిస్తారో..? ఒక వేళ స్పందిస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ అమలు చేస్తారో లేకుంటే లైట్ తీసుకుంటారో తెలియాలంటే సీఎం నుంచి రియాక్షన్ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.