కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ఫస్ట్ ఇండియన్స్‌కే ఛాన్స్!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు. ఓ వైపు కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుండటం.. మరోవైపు కరోనా మృతులతో కొన్ని కొన్ని దేశాలు శవాల దిబ్బగా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి తరుణంలో ఈ ఆపత్కాలాన్ని తట్టుకోవడానికి వ్యాక్సిన్‌ను కనుగొనే పనిలో ప్రపంచ దేశాలు నిమగ్నమయ్యాయి. అయితే ఇప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు. కొన్ని దేశాలు టెస్టింగ్ చేస్తున్నా.. ఇంకొన్ని దేశాలు మాత్రం మనుషుల మీద, జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నాయ్ ఇంతవరకు రిజల్ట్ రాలేదు.

ఇదే విజయవంతమైతే..

ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశాలు మరీ ముఖ్యంగా ఇండియన్స్‌కు కాసింత శుభవార్త అందింది. అదేమిటంటే.. కరోనాకు వ్యాక్సిన్ తయారైపోతోందని అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని తేలింది. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచలోనే నంబర్‌ వన్‌గా నిలిచిన, పేరొందిన ప్రముఖ ‘సిరం ఇన్‌స్టిట్యూట్’ కరోనాకు వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ బ్రిటన్‌లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నది. ఇదే వ్యాక్సిన్ విజయవంతమైతే భారత్‌లో 6కోట్ల డోస్‌లను ఈ ఏడాది ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ‘సిరం’ ఆ ప్రకటనలో నిశితంగా వివరించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కోతులపై ప్రయోగాలు సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం మనుషులపై ప్రయోగాలు మొదలు పెడుతోంది. వచ్చే నెలాఖరకు మనుషులపై ప్రయోగ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మొదట ఇండియన్స్‌కే..!

‘ChAdOxl nCov-19’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ విజయవంతం కాగానే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరం ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటితో పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ ఈ వ్యాక్సిన్‌ కోసం కలిసి పనిచేస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఎన్నో వ్యాక్సిన్‌లు తయారు చేసి ప్రపంచంలోనే సీరమ్ ఇనిస్టిట్యూట్‌ పేరొందింది. సెప్టెంబర్ నాటికి 60 మిలియన్ డోసులు రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదట దశలోనే భారతదేశ ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ధర వెయ్యి రూపాయిలు ఉండే చాన్స్‌లు ఎక్కువగా ఉంది.

600 కోట్లు పెట్టుబడి పెట్టి..

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను సిరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అధర్ పూనవాలా మీడియాకు వెల్లడించారు. ‘ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో మంది అత్యున్నత స్థాయి నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఇప్పటికే కనీసం ఐదు వ్యాక్సిన్లు పేజ్-1 క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నట్లు అంచానా వేస్తున్నాం. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేపడుతున్న పరిశోధనలు సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది విజయవంతమై, అన్నీ సవ్యంగా జరిగితే మాత్రం రానున్న సంవత్సర కాలంలోనే దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. వీటిని భారత్ లోని పుణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేస్తాం. ఒక్కో వ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజలకు మాత్రం ఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ కోసం రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిరం కంపెనీ బోర్డు ఈ మద్యే ఆమోదం తెలిపింది’ అని అధర్ వివారాలు వెల్లడించారు. మొత్తానికి చూస్తే ఇది కాస్త ఊరట కలిగించే.. కాసింత శుభవార్తేనని చెప్పుకోవచ్చు.