close
Choose your channels

ఇంద్రకీలాద్రి : హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. వాష్‌రూంలో బంగారం, గుట్టువిప్పిన టాస్క్‌ఫోర్స్

Tuesday, May 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహామండపంలోని ఆరో అంతస్థులో వున్న అమ్మవారి హుండీల్లోని కానుకల లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సమయంలో బంగారు ఆభరణాలను అపహరించేందుకు సిబ్బంది ప్రయత్నించినట్టు అధికారులు గుర్తించారు. ఎస్పీఎఫ్ తనిఖీల్లో నల్లపూసల చైన్, ఒక ఉంగరం, రెండు గిల్టు ఉంగరాలు, బుట్ట దుద్దులు బయటపడడంతో అధికారులు ఖంగుతిన్నారు.

మహామండపం దగ్గర ఉన్న వాష్ రూమ్‌లో ఈ బంగారాన్ని పోలీసులు గుర్తించారు. అపహరించేందుకు యత్నించిన బంగారం విలువ దాదాపు ఐదు గ్రాములపైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ బంగారాన్ని ఎవరు దొంగిలించారనే విషయంపై అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. అయితే ఇంత జరిగినా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ఆలయ అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.. ఇంద్రకీలాద్రిపై వున్న 41 హుండీల్లో 19 రోజుల్లో వచ్చిన కానుకలను లెక్కించగా 2.64 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పదిగంటల పాటు దేవస్థానం సిబ్బందితోపాటు సేవా సంస్థల సభ్యులు కానుకల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 586 గ్రాముల బంగారం, 6.060 కిలోల వెండి వస్తువులను భక్తులు అమ్మవారికి సమర్పించినట్లు అధికారులు ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.