చంద్రబాబును తనిఖీలు చేస్తే తప్పేంటి..!?
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టులో భద్రతా సిబ్బంది తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. అయితే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్నప్పటికీ తనిఖీలు చేయడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ వ్యవహారంపై అటు వైసీపీ నేతలు మాత్రం అసలు ఇందులో తప్పేముంది..? ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు..? ఏదో జరిగిపోయినట్లు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు..? అని వైసీపీ నేతలు సోషల్ మీడియా, ప్రెస్మీట్లు పెట్టి మరీ కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు.
పచ్చ మీడియా శోకాలు!
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్లు వస్తున్న వార్తలపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. "ప్రతిపక్ష నేతగా ఉండగా జగన్ గారిపై విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగినపుడు భద్రత ఎందుకు కల్పించలేదని అడగని పచ్చ మీడియా చంద్రబాబుకు ఏదో జరిగినట్టు శోకాలు పెడుతోంది. ఆయన కాన్వాయ్కి ట్రాఫిక్ను ఆపడం లేదట. ఎయిర్పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట" అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అందర్నీ చెక్ చేస్తున్నారు..!
‘చెప్పింది చేస్తాం.. చేసేదే చెబుతాం.. ఇదే జగన్ ప్రభుత్వ నినాదం’ అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కాగా.. చంద్రబాబును గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణంగానే తనిఖీ చేశారనీ, అది అధికార విధుల్లో భాగమని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలను తనిఖీ చేస్తున్నారని విషయాన్ని ఈ సందర్భంగా బొత్స గుర్తు చేశారు.
ఫొటోగ్రాఫర్ను ముందుగానే పంపి..!
ఫొటోగ్రాఫర్ను ముందుగానే అనుకున్న ప్రాంతానికి పంపి ఈ తనిఖీలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో తీయించారని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. లేదంటే ఇలాంటి ఫొటో బయటకు వచ్చే అవకాశమే లేదని ఆయన చెప్పుకొచ్చారు. సాధారణ ప్రయాణికుడి నుంచి జడ్ ప్లస్, జడ్ ప్లస్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తులు అయినా సరే తనిఖీలు లేకుండా విమానం ఎక్కలేరని ఐవైఆర్ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ తనిఖీ బహిరంగంగా చేయాలా? లేక ప్రత్యేకంగా చేయాలా? అన్నది వారివారికి నిర్ణయించిన ప్రభుత్వ మర్యాదను అనుసరించి ఉంటుందని ట్విట్టర్ వేదికగా ఐవైఆర్ చెప్పుకొచ్చారు.
కాగా.. ఎయిర్పోర్టు లోపల సీఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుంది.. అయితే బయట మాత్రమే ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీఐఎస్ఎఫ్ అధికారుల నుంచి గానీ.. పౌరవిమానయానశాఖ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.