close
Choose your channels

అసలీ సుప్రియా తివారీ ఎవరు? ఎందుకంతలా ఆమె పేరు ట్రెండ్ అవుతోంది?

Thursday, May 20, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

22 ఏళ్ల యువతి.. ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఆమె చర్చే. ఉన్నట్టుండి సడెన్‌గా వేగంగా వెళుతున్న రైలు నుంచి ఆమె తప్పి పోయింది. ఏమైందో ఏంటో తెలియదు.. చివరకు ఆమె మృతదేహం రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద లభించింది. అసలు కదులుతున్న రైలు నుంచి ఆమె ఎలా తప్పిపోయింది. శవంగా ఎలా మారింది? అంతా మిస్టరీ. ఇది జరిగి దాదాపు మూడు నెలలవుతున్నా.. పోలీసులు మాత్రం ఈ చిక్కుముడిని విప్పలేకపోయారు. దీంతో ఇప్పుడు ఆమెకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కోరుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని అనుపూర్ జిల్లాలో నివసిస్తున్న సుప్రియా తివారీ అనే 22 ఏళ్ల యువతి.. ఈ ఏడాది మార్చి 2న సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ ‌లో భోపాల్‌‌లోని తన సోదరి ఇంటికి వెళ్లేందుకు పయనమైంది. సెకండ్ ఏసీలో ప్రయాణిస్తున్న సుప్రియ రాత్రి 10 గంటల సమయంలో వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఆ సమయంలో బెర్త్‌లోనే తన మొబైల్‌, పర్స్‌ను వదిలేసింది. ఆమె ఎంతకీ రాకపోవడంతో అనుమానించిన తోటి ప్రయాణికులు విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ రోజు అసలామె ఏమైందన్న విషయంలో క్లారిటీ అయితే రాలేదు.

మార్చి 3న గుజరాత్‌లోని లింఖేడా తహసీల్‌లోని గోరియా గ్రామంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ సమీపంలో సుప్రియ మృతదేహం స్థానికులకు కనిపించింది. వెంటనే స్థానికులు గ్రామానికి చెందిన స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత, ఆమె కుటుంబానికి సమాచారం ఇవ్వడంతో వారు సుప్రియా మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ సుప్రియ ఎలా మరణించిందన్న విషయంలో క్లారిటీ లేదు. పోలీసులు సైతం ఇప్పటి వరకూ ఈ కేసు విచారణలో ఏమాత్రం ముందడుగు వేయలేక పోయారు.

ఏసీ కోచ్‌లో డోర్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. అంతేకాకుండా ఏసీ కోచ్‌లకు ఒక అటెండెంట్ కూడా ఉంటాడు. అయినప్పటికీ ఆమె మిస్ అయ్యింది. అంతేకాదు నిర్జీవంగా తమ కుటుంబ సభ్యులకు దొరికింది. సుప్రియ మరణంపై ఎంక్వైరీ చేయాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె సోదరి సైతం భోపాల్ సీఎం శివరాజ్ పాటిల్‌కు న్యాయం జరిపించాలని కోరుతూ లేఖ రాసింది. ఆమెను ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ కేసును ఆత్మహత్య అనే కోణంలో మాత్రమే విచారణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లు సుప్రియ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. #justiceforsupriya ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.