close
Choose your channels

వైఎస్, చంద్రబాబు లాగా కేసీఆర్‌ శిక్షించలేకపోతున్నారేం!?

Saturday, November 30, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైఎస్, చంద్రబాబు లాగా కేసీఆర్‌ శిక్షించలేకపోతున్నారేం!?

దివంగత ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాల్లో పెద్దాయనగా పిలుచుకునే వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల పాలన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరికి వారే.. ఎవరి రేంజ్ వారిదే.. అంటే ఇక్కడ ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అని కాదు. వీరిద్దరి పాలనలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులున్నాయో.. తప్పులు చేసిన వారికి ఎలాంటి కఠిన చర్యలు విధించారో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. కాస్త వెనక్కి వెళ్లి వీళ్ల హయాంలో ఏం జరిగిందో పెద్దలను కానీ.. యూ ట్యూబ్‌ వీడియోల్లో కానీ చూస్తే అర్థమవుతుంది.

వైఎస్ హయాంలో ఇలా..!

2008 డిసెంబర్ 10న వరంగల్‌‌‍లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్వప్నిక, ప్రణీతతో కలిసిన స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా శ్రీనివాస్ అనే ప్రేమోన్మాది చేసిన యాసిడ్ దాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా పెనుసంచలనంగా మారింది. కాగా ఈ దాడిలో గాయపడ్డ స్వప్నిక అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆ టైమ్ శ్రీనివాస్ అతనికి సహకరించిన నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి వారి వాడిన ఆయుధాలన్న చోటికి తీసుకెళ్తుండగా ఎన్‌కౌంటర్ చేయబడ్డారు.! అయితే అది ఎన్‌కౌంటరా లేకుంటే పోలీసుల మీద దాడికి యత్నించడంతో ఆత్మ రక్షణ కోసం ఖాకీలే తుపాకులకు బుద్ధి చెప్పారా..? అనేది పక్కనెడితే జరగాల్సింది జరిగిపోయింది.. ఆ నిందితులందరీకి స్పాట్ శిక్ష పడిపోయిందని అప్పట్లో అందరూ ఆనందించారు. అంటే చావుకు బదులు చావు అన్నట్లుగా అప్పట్లో అలా జరిగిపోయింది. అప్పట్లో అందరూ వైఎస్సార్‌ను దేవుడిలా కొలిచారు. అంతేకాదు.. ఈ ఘటన జరిగిన తర్వాత చాలా వరకు ఇలాంటి నేరాలు ఘోరాలు చేయడానికి జనాలు జంకారు. ఇప్పటికీ.. ఎప్పటికీ ఇది చరిత్రలోనే ఉండిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ సీపీగా ఉన్న సజ్జనారే నాడు వరంగల్ ఎస్పీగా ఉన్నారు.

చంద్రబాబు హయాంలో ఇలా..!

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లు.. రోజుకు పలు చోట్ల పదుల సంఖ్యకుపైనే జరిగేవి. ఏ పోలీస్ స్టేషన్‌లో ఇవే కేసులు ఎక్కువగా ఉండేవి. దీంతో మహిళలు ఇళ్లలో నుంచి రోడ్డు మీదికి రావాలన్నా.. ఉద్యోగాలకు పోవాలన్న భయపడుతుండేవారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయటికొచ్చే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో నడిరోడ్డుపై పట్టపగలే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఈ వరుస ఘటనలకు పాల్పడుతున్న వారు పోలీసులపై దాడికి యత్నించగా.. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపగా.. స్పాట్‌లోనే కుప్పకూలిపోయారు. ఈ ఘటన జరిగిన సుమారు రెండేళ్ల పాటు చైన్ స్నాచింగ్ జరిగిందని హైదరాబాద్‌కు లోపల ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషమని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎన్‌కౌంటరా లేకుంటే.. మరోటేమైనా జరిగిందా అనేది పక్కనెడితే పోలీసులు చేయాల్సింది చేసేశారు.. జరగాల్సింది జరిగిపోయింది.. ఫైనల్ భాగ్యనగర వాసుల్లో ఆ భయం అనేది పోయింది.

ముఠాను మట్టుబెట్టడం..!

చైన్ స్నాచింగ్‌ ఘటన తర్వాత కొందరు దొంగలు ముఠాగా ఏర్పడి ఫామ్‌ హౌస్‌లపై దోపిడీ చేయడం.. కొన్ని చోట్ల అత్యాచారాలు కూడా చేస్తుండటంతో వీరిని ఆ ముఠాను కాపుగాసి మరీ పట్టుకున్న పోలీసులు కఠినంగా శిక్షించారు. ఇది కూడా సేమ్ టూ సేమ్.. పైన చెప్పిన విధంగానే జరిగింది. ఆ తర్వాత ముఠాలు దొంగతనం చేయాలన్నా.. దొంగతనం అనే ఆలోచనే రాకపోవడం విశేషమే.

ఇప్పుడెందుకు అలా జరగట్లేదు..!

వాస్తవానికి తెలంగాణలో అది కూడా రాష్ట్ర రాజధాని, ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమైన హైదరాబాద్‌లో 2014 నుంచి నేటి వరకూ ఎన్ని ఘటనలు జరిగాయో లెక్కేలేదు. మరీ ముఖ్యంగా ఐదు నెలల చిన్నారులపై మొదలుకుని కాటికి కాలుచాపిన ముదుసలి వరకు ఇలాంటి ఘటనలకు కామాంధులు పాల్పడుతున్నా వారికి కఠిన శిక్షలు ఎందుకు విధించట్లేదు..? 2014 నుంచి కేసీఆర్ సర్కారే ఉంది కదా..? అనేది ఎవర్ని పలకరించినా తెలంగాణ వాసుల్లో వస్తున్న మొదట మాట. అసలు కేసీఆర్ ఎందుకు ఇలాంటి వాటి కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు..? వైఎస్ హయాంలో.. బాబు హయాంలో జరిగిన ఘటనలను ఉదహరించి మరీ కేసీఆర్‌ను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కేసీఆర్, కేటీఆర్ ఏం చేయబోతున్నారు!?

మరి కేసీఆర్ ఇలాంటి వారిపై కఠిన శిక్షలు వేయడానికి పోలీసుకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తారా..? లేకుంటే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు కొత్త చట్టం ఏమైనా తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరిస్తేనే మంచిదని లేకుంటే తెలంగాణలో నేరాలు ఘోరాలు పెరిగిపోతాయని విశ్లేషకులు మేథావులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ మంత్రి తాను ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటానని చెప్పారు. మరి కేటీఆర్ ఏం చేయబోతున్నారో ఏంటో..!

కట్టలు తెంచుకున్న ఆగ్రహం..!

ఇందుకు ప్రత్యేకించి మరీ ఉదాహరణలు చెప్పనక్కర్లేదు.. శంషాబాద్‌లో జరిగిన దారుణ హత్యకేసులోని నిందితులున్న షాద్ నగర్‌ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడానికి ఆందోళనకారులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన చేపట్టాయి. ఒకానొక సందర్భంలో చొచ్చుకొని పోయి స్టేషన్ మీద పడే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అలెర్టయిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో చరిత్రలో కనివీని ఎరుగని రీతిలో పోలీస్ స్టేషన్‌కు బేడీలు వేయడం గమనార్హం. ప్రజలు ఇలాంటి ఘటనలపై ఎంతో ఆక్రోశం.. ఆవేశంతో ఉన్నారో క్లుప్తంగా చెప్పడానికి ఇదొక్కటి చాలని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆ నిందితులను జైలుకు తరలించేటప్పుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ జనాల ఆగ్రహం కట్టలు తెంచుకుని నిందితులను తరలించే వాహనాలపై చెప్పులు, రాళ్లు, కర్రలు విసిరారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి వారిని చెదరగొట్టి.. నిందితులను జైలుకు తరలించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.