మోదీ కేబినెట్లోకి ‘షా’.. కీలక పదవి!?
- IndiaGlitz, [Saturday,May 25 2019]
సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కమలం వికసించింది. ఊహించని చోట.. కంచుకోటలను సైతం బద్దలు కొడుతూ దూసుకెళ్లి మరీ బీజేపీ జెండాను ఎగరేశారు కమలనాథులు. ఇలా అఖండ మెజారిటీతో విజయాన్ని సొంతచేసుకున్న బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. త్వరలోనే నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే.. కేబినెట్లోకి ఎవరెవర్ని తీసుకుంటారు..? కొత్తగా ఎవరికి అవకాశాలుంటాయ్..? అనే విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
కాగా.. మోదీ కేబినెట్లో కొత్తవారికి ఈ సారి అవకాశం దక్కే సూచనలు మెండుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాకు మోదీ టీమ్లో కీలకమైన పదవి లభించే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కారణం అనారోగ్య కారణాలతో అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే. ఆ లోటును భర్తీ చేయాలంటే మరో రాజకీయ ఉద్ధండుడు, వ్యూహకర్త అయిన ‘షా’ తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది.
అమిత్షాకు కీలకమైన హోం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖల్లో ఏదో శాఖ అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. షాతో పాటు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్, నితిన్గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, పీయుష్గోయెల్, నరేంద్రసింగ్ తోమర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులకు మోదీ కేబినెట్లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.