రోజా వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అవుతాడా!?
- IndiaGlitz, [Monday,December 09 2019]
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి చెమ్డాలు ఊడేలా రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దిశ నిందితుల ఎన్కౌంటర్ అనంతరం మళ్లీ మాటమార్చిన విషయమూ విదితమే. అయితే నాడు అలా.. నేడు ఇలా అంటూ సోషల్ మీడియాలో.. టీవీ చానెళ్లలో పెద్ద చర్చే జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ బెత్తం దెబ్బలు ప్రస్తావనకు తెచ్చారు ఎమ్మెల్యే రోజా.
రియాక్షన్ ఉంటుందా!
‘ఒకప్పుడు తన (పవన్ కల్యాణ్) కుటుంబ సభ్యులను దూషించిన వాళ్లను చంపేద్దామని గన్ తీసుకుని వీధుల్లోకి వచ్చిన వ్యక్తి.. ఇవాళ అత్యాచారం చేస్తే రెండు బెత్తం దెబ్బలు వేయాలంటున్నారు. అత్యాచారానికి శిక్షగా రెండు బెత్తం దెబ్బలు వేయాలనడాన్ని ఖండిస్తున్నాను. చరిత్రలో రెండు చోట్ల ఓడిపోయిన ఏకైక నాయకుడు పవన్ కల్యాణే’ అని రోజా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని కలుగజేసుకుని.. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడొద్దని ఒకింత వార్నింగ్ ఇచ్చారు. దీంతె రోజా తన విమర్శలను సభలో ఉన్న జనసేన ఎమ్మెల్యే ద్వారా పవన్ కల్యాణ్ కు తెలియజేస్తున్నట్టు సవరణ ప్రకటించారు. అయితే తనపై విమర్శలు గుప్పించేవారికి అంతే రీతిలో కౌంటరిచ్చే పవన్ కల్యాణ్.. రోజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాల్సిందే మరి.