వంగవీటి రాధా కీలక నిర్ణయం.. ఈసారి జనసేనలోకి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఘోరంగా ఓటమిని చవిచూసిన పార్టీల్లో వలసలు వేగవంతమవుతున్నాయి. టీడీపీ దారుణంగా ఓటమి చెందడంతో ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు, ఆర్థికంగా అండగా ఉన్నవారంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే తాజాగా టీడీపీకి చెందిన కీలకనేత.. ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై.. సైకిలెక్కిన నేత వంగవీటి రాధా జనసేనలో చేరేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో రాధా భేటీ అయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే నేడో రేపో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విజయవాడలో తన కార్యకర్తలతో సమావేశమైన అనంతరం తన రాజకీయ భవిష్యత్పై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. టీడీపీకి చెందిన కాపు నేతలు బీజేపీలో చేరబోతున్నట్లు గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వంగవీటి కూడా కాషాయ కండువా కాకుండా ప్రాంతీయ పార్టీ జనసేన తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీలోకి వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోవడంతో జనసేనలోకి వెళ్లాలని రాధా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పవన్ నేడు పార్టీకి సంబంధించిన కమిటీలను ప్రకటించే నిమిత్తం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రాధా చేరిక చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే.. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలోనూ రాధా పనిచేశారు. తాజాగా తమ్ముడు పవన్ చెంతకు రాధా చేరబోతున్నారు. సో.. జనసేనలో చేరిన తర్వాత రాధా పరిస్థితి ఎలా ఉండబోతోంది..? ఈయనకు ఏ బాధ్యతలు పవన్ కట్టబెట్టబోతున్నారు..? అనే విషయాలు తెలియాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.