వైసీపీనే నమ్ముకున్న ఆయనకు టికెట్ ఇచ్చిన జగన్!
- IndiaGlitz, [Tuesday,January 15 2019]
ఎప్పుడైనా మనకు పార్టీలో గుర్తింపు రాకపోతుందా..? మనల్ని, మన సేవల్ని పార్టీ అధినేత గుర్తించి టికెట్ ఇవ్వకపోతారా..? పార్టీనే నమ్ముకుని పనిచేసుకుంటూ పోతే టికెట్ మనకు వచ్చి తీరుతుంది..? అని భావించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాంచిన నాటి నుంచి నేటి వరకూ ప్రజలతో మమేకవుతూ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచేస్తాననే ధీమాకు వ్యక్తం చేసే రేంజ్కు వెళ్లాడు ఆ వైసీపీ నేత. ఇంతకీ ఆ అదృష్టవంతుడెవరు..? ఈ కథేంటో తెలియాలంటే ఆర్టికల్పై ఓ లుక్కేయండి.!
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి గెలిచిన ఆది నారాయణరెడ్డి కొద్దిరోజులకే కండువా మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వెళ్లి మంత్రి పదవి దక్కించుకుని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆయన ఫిరాయించడంతో సడన్గా సుధీర్ రెడ్డి రంగంలోకి దిగిపోయారు. నియోజకర్గంలోని ప్రజలతో నిత్యం టచ్లో ఉండటం, వారి సమస్యలను పరిష్కరిస్తూ.. సర్కార్ను ఎండగట్టడం చేస్తున్న ఈయన్ను గుర్తించిన అధిష్టానం నియోజకవర్గ ఇన్చార్జ్గా ప్రమోషన్ ఇచ్చింది. సుధీర్ రెడ్డి కుటుంబానికి పొలిటికల్ బ్రాగ్రౌండ్ కూడా ఉండటంతో పెద్దగా ఇబ్బందులేమీ లేకుండా పార్టీలో ఇమడగలిగారు. ఒకప్పుడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత మైసురారెడ్డి సోదరుడి కుమారుడే సుధీర్ రెడ్డి. కాగా ఈ టికెట్ రావడం వెనుక కడప జిల్లాకు చెందిన ఓ కీలకనేత, అనంతపురంకు చెందిన ఓ సీనియర్ నేత హస్తముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా.. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేయించిన జగన్.. ఎవరికి టికెట్లు ఇవ్వాలి..? ఎవరికి ఇవ్వకూడదని లెక్కలేసుకుని జాబితాను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడట. అందుకే ఇటీవల పాదయాత్ర ముగించుకుని సొంత జిల్లా కడపకు వెళ్లిన ఆయన జమ్మలమడుగు, మైదుకూరు అభ్యర్థులను ప్రకటించేశారు జగన్. జమ్మలమడుగు నుంచి సుధీర్ రెడ్డి, మైదుకూరు నుంచి రఘురామిరెడ్డిని బరిలోకి దింపుతున్నా గెలిపించుకొని రండి అంటూ ఆయా నియోజకవర్గ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.
మోసం చేయలేను..
నేను అబద్దం చెప్పలేను. మోసం అంతకన్నా చేయలేను. నామీద ఏమాత్రం అభిమానం, నమ్మకం ఉన్నా కలిసి పనిచేసి సుధీర్రెడ్డికి సపోర్టు చేయండి.. దేవుడు ఆశీర్వదించి నా నెత్తిన రాసిపెడితే నేను ముఖ్యమంత్రినవుతాను అని జగన్ చెప్పుకొచ్చారు. సుధీర్ రెడ్డికి టికెట్ ప్రకటన చేస్తుండగా అల్లె ప్రభావతి తనకివ్వాలని అడగ్గా ఈ మాట అన్నారు. అనంతరం అవకాశముంటే కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని అల్లెకు హామీ ఇచ్చారు. మొత్తానికి చూస్తే పార్టీని నమ్ముకున్న వాళ్లకు జగన్ న్యాయం చేస్తాడని ఈ తాజా ప్రకటనతో చెప్పుకోవచ్చు. అయితే ఈ మాట అభ్యర్థుల ప్రకటన వరకు ఉంటుందా..? లేకుంటే మధ్యలోనే మారుతుందా..? అనే విషయం తెలియాలంటే తొలిజాబితా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.