రైతన్నకు జగన్ సర్కార్ శుభవార్త.. టీడీపీకి మరో షాక్!
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధికారంలోకి వస్తే రైతన్నలకు శుభవార్త చెబుతామని.. ముఖ్యంగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని పాదయాత్ర, ఎన్నికల ప్రచారంలో పదేపదే వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకునే దిశగా వైఎస్ జగన్ అడుగులేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న వైఎస్ జగన్.. తాజాగా.. రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బుధవారం నాడు జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్, ఇంధన శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ పథకం కింద రైతులకు పగటి పూట ఉచిత విద్యుత్ 9 గంటలు ప్రభుత్వం ఇవ్వనుంది. కాగా, ఇప్పటికే 60 శాతం ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మిగిలిన 40 శాతానికి సంబంధించి సీఎం జగన్ అధికారులతో చర్చించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చించారు.
ఆనందంలో రైతన్నలు!
జగన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఏపీ రైతన్నలకు శుభవార్త అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం అని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ప్రకటనపై వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి వనరులులేని ప్రాంతంలో రైతుల బోర్లుకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని దివంగత మహానేత వైయస్ఆర్ ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేశారని.. కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్టు రాలేదన్నారు. అయినప్పటికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించిన మొదటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి అని అన్నారు. వైయస్ఆర్ ఉన్నంత కాలం 7 గంటలు కూడా విద్యుత్ను అందించారన్నారు. ఆయన బాటలో తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి నడవడం గర్వకారణమన్నారు. వైఎస్ఆర్ జయంతిని ‘రైతు దినోత్సవం’గా ప్రకటించడం పట్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారన్నారు.
ఎవర్నీ వదలొద్దు..
గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ హాయంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్ సబ్కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు బుధవారం నాడు జగన్ సంచలన ప్రకటన చేశారు. మొత్తం 30 అంశాలపై విచారణ చేయిస్తామని.. సీసీబీ, సీఐడీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థల సహకారం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం వాటిల్లిందని.. ఈ డబ్బును రికవరీ చేయాలన్నారు. కంపెనీలతో తిరిగి సంప్రదింపులు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని.. సోలార్, విండ్ కంపెనీలు దారికి రాకుంటే వారితో ఒప్పందాలు రద్దుచేయాలన్నారు. సోలార్, విండ్ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగినట్టు స్పష్టమైందన్నారు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్నా వదిలిపెట్టొద్దని.. ఉన్నతాధికారులు, మంత్రి, ముఖ్యమంత్రి ఉన్నా సరే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.
కాగా.. ఈ ప్రకటనతో టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. నిజంగా ఇదే జరిగితే టీడీపీకి మరో షాకింగ్ న్యూసే అని.. ఇలా వరుసగా వైఎస్ జగన్ షాక్ల మీద షాకులిస్తూ పోతే తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని పార్టీ శ్రేణులు ఒకింత ఆలోచనలో పడ్డాయట. ఇదిలా ఉంటే మున్ముంథు టీడీపీకి మరిన్ని షాక్లు తప్పవని వైసీపీ శ్రేణులు అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.