సీఎం జగన్ ఈ విషయాలను అస్సలు పట్టించుకోవట్లేదేం!

  • IndiaGlitz, [Thursday,June 06 2019]

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో విజయకేతనం ఎగరవేసిన వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పాలనలో సంస్కరణల దిశగా అడుగులేస్తున్నారు. మరోవైపు రాటుదేలిన అధికారులను రాష్ట్రానికి పట్టుకురావడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యవహారం ఇవన్నీ చకచకా చేసేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం, మంత్రుల ప్రమాణం, అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ జరుగుతాయ్. అయితే వైఎస్ జగన్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా మొదట పలు శాఖలకు అధికారులను నియమించడం.. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు మార్పులు చేర్పులు చేయడంతో పాటు విద్య, వైద్య, ఆర్థిక, రెవెన్యూ ఇలా వరుసగా అధికారులతో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఈ రెండు విషయాలనే ఎందుకు..!?

అయితే అన్నీ ఓకే కానీ.. కొన్ని విషయాలను మాత్రం వైఎస్ జగన్ అస్సలు పట్టించుకోవట్లేదు.. అంతేకాదు వైఎస్ జగన్ దగ్గర ఆ ప్రస్తావన కూడా అస్సలు రాలేదు. ఇంతకీ ఆ విషయాలు ఏంటంటే.. పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేయడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యాడు కూడా. మరోవైపు.. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని సొంతింట్లో అతి దారుణంగా హత్య చేయడం.. ఇలాంటి వరుస ఘటనలతో వైసీపీ శ్రేణులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాయి. జగన్ సీఎం అయితే కచ్చితంగా కోడికత్తి కేసు, బాబాయ్ హత్య కేసును సీరియస్‌గా తీసుకుని దోషులెవరైనా సరే.. తాట తీస్తారని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు అందరూ భావించారు. అయితే జగన్ మాత్రం ఈ విషయాలను అస్సలు పట్టించుకోవట్లేదు.

వివేకా హత్యకేసు మళ్లీ మొదటికేనా..!?

ఇదిలా ఉంటే.. ఇప్పటికే డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను నియమించిన సీఎం.. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పెండింగ్‌లో ఉన్న ప్రతీ కేసును నిశితంగా పరిశీలిస్తారని అందులో మొదట కోడికత్తి, బాబాయ్ హత్యకేసులు ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్‌ ఈ రెండు కేసుల్లో సంచలన ఆరోపణలు వైఎస్ కుటుంబంపైనే వచ్చాయి. దీంతో తనపై ఉన్న మచ్చను తొలగించాడినికైనా దర్యాప్తు వేగవంతం చేయడం లేకుంటే మళ్లీ మొదట్నుంచి కేసు వ్యవహారాలను చూడటం లాంటిది చేయాల్సి ఉంది. అంతేకాదు.. జూన్-05న సీఎం జగన్‌తో వైఎస్ వివేకా కుమార్తె సునీత కలిసి కేసు విషయం చర్చించి.. కేసును మళ్లీ మొదట్నుంచి దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారని సమాచారం.

ఆ రెండు కేసులతో పాటు ఇవి కూడా!

అంతేకాదు.. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తారు..? అనే అపోహ కొందరిలో కలిగింది.. ఈ విషయంలో సీఎం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ విషయంపై మాట్లాడినప్పటికీ ఈ సమయంలో ఆయన స్పందిచాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఏపీ హైకోర్టు ఎక్కడ నిర్మించాలి..? కేవలం పరిపాలన భవనాలు, అభివృద్ధి అనేది అమరావతికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించేలా అక్కడక్కడ మార్పులు చేర్పులు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటితో పాటు కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసు ఇలాంటి కేసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ విషయాలను పక్కనెట్టిన వైఎస్ జగన్.. త్వరలో అయినా పట్టించుకుని ఓ కన్నేసి ఉంచుతారా లేకుంటే అలా అస్సలే పట్టించుకోకుండా పక్కనెట్టేస్తారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.