తపిస్తున్నా.. అవినీతిని సహించే పరిస్థితే లేదు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో అవినీతిని ఆస్కారం లేదన్న సందేశం పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలని.. ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చిచెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరగడానికి వీల్లేదని, టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ పనుల్లో గత ఐదేళ్లలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో శనివారం నాడు జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తపిస్తున్నానని చెప్పారు. రూ. 100 పనికి రూ. 80కే పనిజరుగుతుందంటే రివర్స్ టెండరింగ్కు వెళదామని, అలాంటి అధికారులను సన్మానిస్తామని జగన్ చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ ఎక్కడ చేయగలమో గుర్తించాలని నిపుణులు, అధికారులకు జగన్ సూచించారు. పారదర్శకతలో ఏపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలవాలని, అందుకోసమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరినట్టు సీఎం స్పష్టం చేశారు.
అక్రమాలపై నిగ్గు తేల్చాలి..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించారు. రెండు రోజుల క్రితం దినపత్రికలో వచ్చిన కథనాలను ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం పనుల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని నిపుణుల కమిటీకి ఆదేశాలిచ్చారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉందని, అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని.. స్పిల్వే పూర్తిచేయకుండా కాఫర్ డ్యాంకు వెళ్లారు, దాన్ని కూడా పూర్తిచేయకుండా వదిలేశారని వివరించారు. ఇప్పడు భారీగా వరద వస్తే 4 నెలలపాటు పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని, గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఇలా అయిందన్నారు. పోలవరం తనకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.